Wednesday, June 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినరమేధంపై గ్రేటా తెగువ

నరమేధంపై గ్రేటా తెగువ

- Advertisement -

హిట్లర్‌, ముస్సోలినీలను మించి నరమేధం సాగిస్తున్న నెతన్యాహు సర్కారుపై, దానికి సమస్త వనరులను కట్టబెడుతున్న అమెరికా తీరుపై ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పసిబిడ్డలు, మహిళలనుసైతం శత్రువులుగా చూస్తూ సహాయ కేంద్రాల వద్దకు ఆహారం కోసం వచ్చిన వారిని సైతం చంపుతున్న ఇజ్రాయిల్‌ దుర్మార్గం యువతను కదిలించివేస్తోంది. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌, పాలస్తీనా సంతతికి చెందిన యూరోపియన్‌ పార్లమెంట్‌లో ఫ్రెంచి సభ్యురాలు రిమాహసన్‌తోపాటు పన్నెండు మంది యువ కార్యకర్తల బఅందం ఈ నెల ఒకటిన సిసిలీ నుంచి బ్రిటీష్‌ నౌక మాడ్‌లీన్‌లో గాజాకు బయల్దేరింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయికి మించి 55 వేలమందికిపైగా అమాయ కులను, అందులోనూ అత్యధికంగా మహిళలు, చిన్నారులను ఇజ్రాయిల్‌ పొట్టన పెట్టుకుంది. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థి కేంద్రాలతో సహా కీలకమైన మౌలిక వసతులన్నింటినీ నాశనం చేసింది. ఇరవై లక్షలకుపైగా నివాసాలను భస్మీపటలం చేయడంతోపాటు డేరాల కింద తలదాచుకుంటున్న వారిని మాటిమాటికీ ఖాళీ చేయిస్తోంది. గాజాలోకి ఆహారం, ఇతర నిత్యావసరాలు తీసుకొచ్చే మానవతా సాయాన్ని సైతం అడ్డుకుంటోంది. పాలస్తీనా జాతి నిర్మూలన చేయాలన్న లక్ష్యంతో మానవతా విపత్తులోకి నెట్టిన ఇజ్రాయిల్‌ దుర్మార్గం మత, జాతి ఉన్మాదులకు మానవత్వం ఉండదనడానికి మరో రుజువు.
ఈ ఘాతుకాలన్నీ అంతర్జాతీయంగా చర్చనీయాంశం చేయాలని, ఇజ్రాయిల్‌ సముద్ర దిగ్బంధనాన్ని ఛేదించి పిల్లల కోసం పాలు, ఆహార పదార్థాలు, అత్యవసర వైద్య పరికరాలు, ఇతర జీవనావసరాలను అందజేసేందుకు ఫ్రీడమ్‌ ఫ్లోటిల్లా ఆధ్వర్యాన బ్రిటీష్‌ నౌక మాడ్‌లీన్‌ బయల్దేరింది. గాజాకు 200 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లోనే ఈ నౌకను ఇజ్రాయిల్‌ నిర్బంధించడం, సహాయం అందకుండా చేయడం అమానుషం. నిర్బంధంలోకి తీసుకున్న గ్రెటా థన్‌బెర్గ్‌తో సహా నలుగురిని స్వదేశాలకు పంపివేసింది. ఇజ్రాయిల్‌ నిర్బంధంలోనే ఉన్న మిగిలిన వారు స్వదేశాలకు వెళ్లడానికి నిరాకరించి, ఆందోళన చేస్తున్నారు. తనను, తన సహచరులను అంతర్జాతీయ జలాల్లో కిడ్నాప్‌ చేశారన్న గ్రేటా ఇజ్రాయిల్‌ అధికారులు తమ పట్ల వ్యవహరించిన అమానవీయమైన తీరు పాలస్తీనియన్ల వేదనతో పోలిస్తే లెక్కలోకి రాదన్నారు. దిగ్బంధనాన్ని ఛేదించడం దేశాల చట్టపరమైన బాధ్యత, మనందరి నైతిక బాధ్యత అన్న ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూత ఫ్రాన్సెసా అల్బనీస్‌ మాటలను లెక్కచేయని ఇజ్రాయిల్‌, అమెరికాల తీరు దుర్మార్గం. ఈ ప్రతిఘటన ద్వారా ఇజ్రాయిల్‌ నరమేధాన్ని మరోసారి అంతర్జాతీయ సమాజం ముందుంచిన గ్రెటా థన్‌బర్గ్‌ బృందం కృషి అభినందనీయం. ఇంతటి రాక్షసకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్‌కు నేటికీ అమెరికా వంత పాడుతూనే ఉంది. గ్రెటాకు కాస్త కోపం ఎక్కువనుకుంటా, ముందుగా ఆమె కోపాన్ని తగ్గించుకునే క్లాసులకు వెళ్లాలంటూ ట్రంప్‌ ఉచిత సలహా ఇచ్చారు. ‘ఎముకలు క్రుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా చావండి! నెత్తురుమండే శక్తులు నిండే సైనికులారా రారండి’ అన్న శ్రీశ్రీ ‘మరో ప్రపంచం’ పిలుపు యువతకు అభ్యుదయ మార్గానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. అందువల్ల అటువంటి చచ్చు సలహాలు ఉద్యమకారుల స్ఫూర్తిని ఏమాత్రం ప్రభావితం చేయవు.
ఇజ్రాయిల్‌ దుర్మార్గాలపై ఇటీవల అమెరికా గడ్డ మీద గర్జించిన యువ విజ్ఞాన వేత్త మేఘా వేమూరిని గుర్తు చేసుకోవడం అవసరం. ‘మేము గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని మా జీవితంలో ముందుకు సాగడానికి సిద్ధమవుతుంటే, గాజాలో విశ్వవిద్యాలయాలే లేకుండా పోయాయి’ అంటూ తన భవిష్యత్‌ను సైతం పణంగా పెట్టి ప్రశ్నించిన ఆమె తీరు యువతకు స్ఫూర్తిదాయకం. పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడటమే నేరమన్నట్టు ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ సహా పలు యూనివర్సిటీలకు నిధులను నిలిపివేస్తున్న, విద్యార్థులను విచక్షణా రహితంగా అరెస్టులు చేస్తూ, బేడీలు వేసి పంపిస్తున్న మితవాద ట్రంప్‌ పాలనలో భారత సంతతికి చెందిన మేఘా చూపినపాటి తెగువ చూపలేని మోడీ సర్కారు తీరు సిగ్గుచేటు. మనదేశంలో పెరుగుతున్న ఉన్మాదాన్ని ఆదిలోనే అడ్డుకోవడం ఎంత అత్యవసరమో ఇజ్రాయిల్‌ పరిణామాలు హెచ్చ రిస్తున్నాయి. దురాక్రమణదారైన ఇజ్రాయిల్‌ పట్ల సందిగ్ధ, బుజ్జగింపు ధోరణిని ఇప్పటికైనా కేంద్రం విడనాడాలి. అమాయకుల ఊచకోతను, యుద్ధ నేరాలను ఖండించాలి. సైనిక, భద్రతా సహకారాన్ని నిలిపివేయాలి. శతాబ్దానికిపైగా పాలస్తీనాకు అండగా నిలిచిన మనదేశ చారిత్రక వైఖరిని కొనసాగించాలి. కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు సంఘీభావం కోసం ఇచ్చిన వామపక్షాల పిలుపునకు సమస్త ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు, పార్టీలు, శాంతికాముకులు మద్దతుగా నిలవాలి.
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -