తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా
నవతెలంగాణ-హిమాయత్ నగర్
గ్రూప్-1 పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని ఈ ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని జాగృతి ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించినా ఇంతవరకు ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు, కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దని అన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకుని ఓట్లు అడిగారని, ఆయన నేడు నిరుద్యోగులనే మోసం చేశారని ఆరోపించారు.
ఇంత వరకు జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు తామే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రూప్-1 పరీక్ష రద్దయ్యేంత వరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణలోని మేధావులు మౌనం వీడాలని కోరారు. అవసరమైతే ప్రొ.హరగోపాల్ను కలిసి గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు ఆయనతో కలిసి పోరాటం, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కూలగొడతారని హెచ్చరించారు. వెంటనే గ్రూప్-1 నియామకాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఏపీ వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్పై తాము ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులు పాల్గొన్నారు.