నవతెలంగాణ-హైదరాబాద్ : జీఎస్టీలో కీలక సంస్కరణలకు కేంద్రం పూనుకుంది. అందులోభాగంగా నాలుగు స్లాబ్లను రెండు స్లాబ్లకు కుదించింది. ఇప్పటివరకు ఉన్న 12 శాతం, 28 శాతం స్లాబులు ఇకపై ఉండవు. లగ్జరీకి చెందినవన్నీ 40 శాతం స్లాబులోకి ప్రతిపాదించింది. రేస్ క్లబ్బులు, లీజింగ్ / రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్పై 40% పన్ను పడుతుంది. ఈ జాబితాలోకి ప్రీమియం క్రికెట్ సహా ఇతర స్పోర్టివ్ ఈవెంట్ల టికెట్ ధరలు చేరాయి. ఇకనుంచి ఐపీఎల్ వంటి టోర్నీల టికెట్ల రేట్లు భారీగా పెరగనున్నాయి. ఇప్పటివరకు ఇవన్నీ 28 శాతం పన్ను పరిధిలో ఉండేవి. ఇకపై అదనంగా మరో 12 శాతం చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో ఐపీఎల్ అభిమానులపై భారం పడే అవకాశం ఉంది. మరి ఒక్కో టికెట్ మీద ఎంత పెరిగే అవకాశం ఉందో చూద్దాం.
ఇంతకుముందు ఐపీఎల్ మ్యాచ్ టికెట్ ధర రూ.1000 ఉందనుకుందాం. దాని మీద 28 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. అంటే టికెట్కు మొత్తం రూ.1,280 చెల్లించాలి. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం ఆ మొత్తం పెరగనుంది. ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ ప్రకారం.. 40 శాతం పన్ను చెల్లించాలి. అంటే రూ. 1000తోపాటు రూ.400 మొత్తం రూ. 1400 చెల్లించాలి. అంటే గతంతో పోలిస్తే రూ.120 వరకూ పెరగనుంది. టికెట్ల ధరలు మారుతూ ఉంటే.. ఆ భారంలోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి.