రోడ్డుపై మృతదేహంతో కుటుంబీకుల ధర్నా
నవతెలంగాణ- మల్దకల్
గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను చదవలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసింది. అయితే, ఓ యువకుడి వేధింపులే తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని రామిరెడ్డిగూడలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో జరిగింది. తల్లిదండ్రులు ఉప్పరి నగేష్, తల్లి పద్మమ్మ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా మల్దకల్కు చెందిన ఉప్పరి నగేష్- పద్మమ్మ దంపతుల కుమార్తె ప్రియాంక(18) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం హాస్టల్ బాత్రూమ్ కిటికీకి ఉరేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. హాస్టల్లో ఉండటం తనకు ఇష్టం లేదని మూడ్రోజుల కిందట ప్రియాంక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని గదిలో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మల్దకల్ మండల కేంద్రలోని బస్టౌండ్ వద్ద రోడ్డుపై మంగళవారం ప్రియాంక మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ధర్నా చేశారు. అయితే, తమ కుమార్తె మృతికి ఖదీర్ అనే యువకుని వేధింపులే కారణమని ఆరోపించారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రియాంక ఆత్మహత్యపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
గురుకుల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES