స్వస్తివచనంతో ఉత్సవ శ్రీకారం చుట్టిన అర్చకులు
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
యాదాద్రిభువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం స్వస్తి వచనంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలో అర్చకులు నిత్య ఆరాధన చేపట్టారు. విశ్వక్సేనారాధన, రక్ష బంధం, పంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ప్రధాన అర్చకులు కాండురి వెంకటాచార్యులు సురేంద్ర చార్యులు నిర్వహించారు. స్వస్తి అంటే శుభం అని వచనం అంటే వాక్కు అని అర్థం అని దేవకోటి సంతోషించి ఉత్సవ మొత్తం ముగిసే వరకు భక్తకోటికి స్వామి వారి పరిపూర్ణ కలింగించటం స్వస్తి వచనం అని అర్చకులు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం మృత్సగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ ప్రారంభం సందర్భంగా ఆలేర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ జే భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ,జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, తదితరులు పాల్గొన్నారు.



