500 సినిమాలకుపైగా పైరసీ
నెలకు రూ.10 లక్షల జీతం, క్రిప్టో కరెన్సీ రూపంలో పేమెంట్స్
దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
పైరసీ ముఠా కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..!
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేవలం ‘కిక్’ కోసం హ్యాకింగ్ను మొదలు పెట్టిన 22ఏండ్ల కుర్రాడు.. దేశంలోని అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు, పలు భాషలకు చెందిన సినిమాలను సైతం హ్యాకింగ్ చేసే స్థాయికి ఎదిగాడు. మూడేండ్ల నుంచి దేశంలోని ఏ రాష్ట్ర పోలీసులకు చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎప్పటికీ పోలీసులు పట్టుకోలేరనే ధీమాతో ఉన్నాడు. ఈ లోగా నిందితుడితోపాటు మరో నలుగురు పైరసీ నిందితులు హైదరాబాద్ పోలీసు లకు చిక్కారు. దేశంలోనే అతి పెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకోవడం ఇదే మొదటిసారని నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం బంజారాహిల్స్లోని సీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు సీపీ విశ్వప్రసాద్, డీసీపీ కవితతో కలిసి పైరసీ ముఠాకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించారు.
బీహార్కు చెందిన అశ్వినీకుమార్, అర్సలాన్ అహ్మద్, తమిళనాడుకు చెందిన సిరిల్ అలియాస్ రాజ్, సుధాకరణ్, ఈస్ట్గోదావరికి చెందిన జానకిరణ్కుమార్ను సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని, వారి నుంచి కంప్యూటర్లు, హార్డ్డిస్కులు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ టూల్స్తోపాటు ఇతర సాంకేతిక పరిక రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పైరసీ ముఠాల వెనక బెట్టింగ్, గేమింగ్ యాప్ మాఫియా ఉందన్నారు. ఈ ముఠా కారణంగా 2023, 2024 ఏడాదిలో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండిస్టీ మొత్తం రూ.24 వేల కోట్లు నష్టపోయిందన్నారు.
2025 జూన్ నెలలో వచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారని సీపీ తెలిపారు. ఈ దర్యాప్తులో అతి పెద్దపైరసీ ముఠా చిక్కిందన్నారు. వీరు రెండు రకాలుగా సినిమా పైరసీ చేస్తున్నారని, ఒకటి థియేటర్కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేయడం, రెండోది అందరూ విస్తుపోయేలా డిజిటల్ శాటిలైట్ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేశారని చెప్పారు. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారన్నారు. సింగిల్, హిట్ 3 సినిమాల పైరసీ జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడులోని కరూర్కు చెందిన సిరిల్ అని, అతను 2020 నుంచి నాలుగు పైరసీ వెబ్సైట్లను నడుపుతున్నాడని చెప్పారు.
కంప్యూటర్ సైన్స్ చదివిన సిరిల్ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేస్తున్నాడన్నారు. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉన్న మంత్ర మాల్ థియేటర్లో జానా కిరణ్కుమార్ రెడ్డి సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ద్వారా మరొకరికి పంపించారని చెప్పారు. నిందితులు.. హైఎండ్ కెమెరా ఉన్న సెల్ఫోన్లను జేబులో గానీ, పాప్కార్న్ డబ్బాలో కానీ పెడతారని అన్నారు. ప్రత్యేక యాప్ ఉపయోగించి సినిమాలను ఈ ముఠా పైరసీ చేసిందని అన్నారు. ఈ యాప్ వల్ల రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫోన్ స్క్రీన్లైట్ కూడా ఆఫ్లో ఉంటుందని, దాంతో ఎవరికీ ఏ అనుమానం రాదని అన్నారు. ఇతర భాషల చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారని తెలిపారు.
పోలీసులది.. ఈసీ వెబ్సైట్ కూడా హ్యాక్
బీహార్లోని పాట్నాకు చెందిన అశ్విన్ కుమార్ అనే 22 ఏండ్ల యువకుడు ఈ కేసులో మరో నిందితుడు. ఇతను డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలను అప్లోడ్ చేస్తున్నాడని, ఇలా 1020 సినిమాలను నేరుగా సర్వర్లను హ్యాక్ చేసి అప్లోడ్ చేశాడని సీపీ తెలిపారు. అశ్విన్ సినిమాలకు సంబంధించిన సర్వర్లు మాత్రమే కాకుండా ప్రభుత్వ విభాగాల వెబ్సైట్లు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ను కూడా హ్యాక్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పారు. ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ చేసి ఉద్యోగుల జీతాల వివరాలు పొందాడని, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ హ్యాక్ చేసి కేవలం ఎన్నికల జాబితాను మాత్రమే చూశాడని తెలిపారు. ఈ సినిమాల పైరసీని ప్రధానంగా ప్రోత్సహిస్తున్నది బెట్టింగ్, గేమింగ్ యాప్ నిర్వాహకులే అని తెలిపారు. పైరసీ సైట్లలోని లింక్లను క్లిక్ చేస్తే యూజర్ వివరాలన్నీ పైరసీ ముఠాకు వెళ్తాయన్నారు. ఎక్కువ సినిమాల పైరసీని కిరణ్, అశ్వనీకుమార్ ముఠా వల్లే జరిగిందని తెలిపారు.
ఈ సినిమాలను పైరసీ చేసేందుకు సిరిల్ అనే వ్యక్తి నెదర్లాండ్స్, ప్యారిస్కు చెందిన ఐపీ అడ్రస్లు వాడుతున్నట్టు చెప్పారు. ఇతనికి బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు నెలకు రూ.10లక్షలు ఇస్తున్నారని అన్నారు. ఈ ముఠా బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీ రూపంలోనే డబ్బులు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటివరకు 500 సినిమాలు పైరసీ చేసినట్టు గుర్తించామన్నారు. సిరిల్ వద్ద కుబేర మూవీతో సహా అనేక సినిమాలను గుర్తించామని, అలాగే 10 క్రిప్టో కరెన్సీ వాలెట్లు, మూడు బ్యాంకు ఖాతాలను గుర్తించామని అన్నారు. హ్యాకర్ల బారిన పడకుండా చిత్రపరిశ్రమతోపాటు ప్రతి ఒక్కరూ కొత్త వర్షన్లను ఉపయోగించాలని తెలిపారు. తెలియని లింక్లను, వెబ్సైట్లను క్లిరు చేయవద్దన్నారు. ఫ్రీగా సినిమాలు వస్తున్నాయని పైరసీని ప్రొత్సహించొద్దని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీలు శివమారుతీ, జానకిరామ్తోపాటు సీఐలు, సైబర్ క్రైమ్ పోలీసులు పాల్గొన్నారు.