– ఆ కోర్సులో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థుల మొగ్గు
– దోస్త్ మొదటి విడతలో 60,436 మందికి సీట్ల కేటాయింపు
– డిగ్రీ కాలేజీల్లో నిజాం టాప్
– ఇప్పటికే 97.7 శాతం సీట్ల భర్తీ : ఉన్నత విద్యామండలి చైర్మెన్ బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను కేటాయించారు. డిగ్రీలో కామర్స్ కోర్సుకే విద్యార్థులు జై కొట్టారు. ఆ కోర్సులో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ దోస్త్ మొదటి విడతకు 89,572 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. వారిలో 65,191 మంది విద్యార్థులు వెబ్ఆప్షన్లను నమోదు చేశారని పేర్కొన్నారు. మొదటి విడతలో 60,436 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. సరిపోయినన్ని వెబ్ఆప్షన్లను నమోదు చేయకపోవడం వల్ల 4,755 మందికి సీట్లు కేటాయించలేదని వివరించారు. మొదటి ప్రాధాన్యతకు అనుగుణంగా 42,014 మందికి సీట్లు కేటాయించామని అన్నారు. రెండు, ఇతర ప్రాధాన్యతల ఆధారంగా 18,422 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. కామర్స్లో 21,758 మంది, ఫిజికల్ సైన్సెస్లో 15,249 మంది, లైఫ్ సైన్సెస్ (జీవ శాస్త్రాలు)లో 11,005 మంది, ఆర్ట్స్లో 5,986 మంది, ఇతర కోర్సుల్లో 6,438 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. ఇంగ్లీష్ మీడియంలో 58,575 మంది, తెలుగు మీడియంలో 1,552 మంది, ఉర్దూ మీడియంలో 309 మందికి సీట్లు కేటాయించామన్నారు. సీట్లు పొందిన వారిలో 22,395 మంది అబ్బాయిలు, 38,041 మంది అమ్మాయిలున్నారని అన్నారు.
74 కాలేజీల్లో సున్నా ప్రవేశాలు
రాష్ట్రంలో దోస్త్ పరిధిలో 805 డిగ్రీ కాలేజీల్లో 3,71,096 సీట్లున్నాయని బాలకిష్టారెడ్డి చెప్పారు. 74 కాలేజీల్లో సున్నా ప్రవేశాలు నమోదయ్యాయని అన్నారు. రెండు, మూడో విడతలో ఆ కాలేజీల్లో విద్యార్థులు చేరొచ్చని చెప్పారు. ఎస్ఎంఎస్ ద్వారా విద్యార్థుల మొబైల్ నెంబర్లకు సీట్ల కేటాయింపు సమాచారం అందిస్తామని వివరించారు. దోస్త్ వెబ్సైట్ ద్వారా లాగిన్లో రూ.500 లేదా రూ.వెయ్యి చెల్లించి ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ను ఈనెల 30 నుంచి వచ్చేనెల ఆరో తేదీ వరకు చేయాలని సూచించారు. సీటును రిజర్వు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ, విశ్వవిద్యాలయ కాలేజీల్లో కేటాయించిన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణకు లోబడి ఈపాస్ ఫీజు రీయింబర్స్మెంట్కు తాత్కాలికంగా అర్హులుగా ఉన్నవారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటును రిజర్వు చేయకుంటే వారి సీటుతోపాటు రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుందని అన్నారు. మూడో విడత సీట్ల కేటాయింపు తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా పొందిన సీట్లను సంబంధిత కాలేజీల్లో జూన్ 24 నుంచి 28 వరకు రిపోర్టు చేయాలని సూచించారు.
నేటినుంచి దోస్త్ రెండోవిడత రిజిస్ట్రేషన్
దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని బాలకిష్టారెడ్డి అన్నారు. రిజిస్ట్రేషన్ గడువు వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకు ఉంటుందని వివరించారు. సీట్ల కేటాయింపు వచ్చేనెల 13న ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోనే డిగ్రీ కాలేజీల్లో నిజాం అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. మొదటి విడతలోనే 97.7 శాతం సీట్లు కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్లు ఇటికాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, కళాశాల విద్యాశాఖ జేడీలు డీఎస్ఆర్ రాజేందర్సింగ్, పి బాలభాస్కర్, ఉన్నత విద్యామండలి ప్రవేశాల కోఆర్డినేటర్ డి వసుంధర, సాంకేతిక సహాయకుడు సిహెచ్ కిశోర్కుమార్, దోస్త్ రాష్ట్ర టెక్నికల్ కోఆర్డినేటర్ ఎ ఇన్నారెడ్డి, సీజీజీ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ పి హేమంత్, సీనియర్ బిజినెస్ అనలిస్టు మతీన్బైగ్ తదితరులు పాల్గొన్నారు. సీట్ల కేటాయింపు, ఇతర వివరాల కోసం https://dost.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది.
