నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేవలం పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు నిధులను విడుదల చేస్తోందని ఆయన ఆరోపించారు.
సోమవారం నాడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన గత బీఆర్ఎస్ పాలనను ప్రస్తుత ప్రభుత్వంతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ రైతుల అవసరాలు గుర్తించి నాట్లకు, నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓట్లకు, ఓట్లకు మధ్య రైతుబంధు ఇస్తోంది” అని ఆయన ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, గ్రామాల్లో ఎరువులు, యూరియా కొరత తీవ్రంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం రైతుల అవసరాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల పాలన కుంటుపడిందని ఆయన ఆరోపించారు.