లీడ్స్కు చేరుకున్న యువ పేసర్
లండన్ (ఇంగ్లాండ్) : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన భారత యువ పేసర్ హర్షిత్ రానా టీమ్ ఇండియాతో పాటు ఉండనున్నాడు!. భారత్-ఏ తరఫున ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన హర్షిత్ రానా ఇంగ్లాండ్ లయన్స్తో నాలుగు రోజుల మ్యాచ్లో 27 ఓవర్లలో 99 పరుగులకు ఓ వికెట్ తీసుకున్నాడు. బెకెన్హామ్లో భారత్తో జరిగిన టూర్ గేమ్లోనూ హర్షిత్ రానా బరిలో నిలిచాడు. టూర్ గేమ్ ముగించుకుని భారత-ఏ క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వస్తుండగా.. హర్షిత్ రానా మాత్రం శుభ్మన్ గిల్సేనతో పాటు తొలి టెస్టు వేదిక లీడ్స్కు చేరుకున్నాడు. లండన్ నుంచి మంగళవారమే భారత క్రికెటర్లు లీడ్స్కు చేరుకున్నారు. తల్లి అనారోగ్యంతో భారత్కు తిరిగొచ్చిన చీఫ్ కోచ్ గౌతం గంభీర్ సైతం మళ్లీ ఇంగ్లాండ్కు చేరుకున్నాడు. మంగళవారమే టీమ్ ఇండియాతో చేరనున్నాడు. ‘భారత జట్టులో కొందరు పేసర్లకు గాయాల సమస్య ఉంది. అందుకే హర్షిత్ రానాను బ్యాకప్గా నిలుపుకున్నారు. అధికారికంగా అతడిని జట్టులోకి తీసుకోలేదు. బ్యాకప్ ప్లేయర్గానూ గుర్తించలేదు. కానీ లీడ్స్లో భారత డ్రెస్సింగ్రూమ్లో హర్షిత్ రానా ఉండనున్నాడు. పరిస్థితులను బేరీజు వేసుకుని ఏదైనా నిర్ణయం ఉండవచ్చు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
జట్టుతోనే హర్షిత్ రానా
- Advertisement -
- Advertisement -