Monday, June 30, 2025
E-PAPER
Homeజాతీయంవిద్వేష ప్రసంగాలు.. నేరాలు

విద్వేష ప్రసంగాలు.. నేరాలు

- Advertisement -

– మైనారిటీలపై విషం చిమ్ముతున్న కమలదళం
– గత ఏడాది కాలంలో పెరిగిపోయిన మతోన్మాద ఘటనలు
– బయట పెట్టిన ఏపీసీఆర్‌ నివేదిక

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. గతేడాది కాలంలో దేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా అనేక నేరాలు జరిగాయి. ఇక విద్వేష ప్రసంగాలకు అంతే లేదు. ప్రధాని మోడీ స్వయంగా ఐదు సందర్భాల్లో మైనారిటీలను అపహాస్యం చేస్తూ ప్రసంగించారు. తామేమీ తీసిపోలేదన్న విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకంగా 63 ప్రసంగాల్లో మైనారిటీలు… ముఖ్యంగా ముస్లింలపై విషం కక్కారు. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు సైతం 71 విద్వేష ప్రసంగాలు చేశారు.
న్యూఢిల్లీ: గత ఏడాది కాలంలో దేశంలో మతపరమైన మైనారిటీలపై నేరాలు బాగా పెరిగాయి. వాటి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని ఓ పద్ధతి ప్రకారం ప్రతీకార దాడులు జరిగాయని పౌర హక్కుల పరిరక్షణ సంఘం (ఏపీసీఆర్‌) ఓ నివేదికలో తెలిపింది. దేశంలోని మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని మతపరమైన హింసకు పాల్పడ్డారని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆ పరిశోధనాత్మక నివేదిక వివరించింది. దాడులు, వాటి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ విద్వేషపూరిత నేరాలను నమోదు చేయడానికి సంస్థాగత ప్రయత్నాలేవీ జరగలేదని వేలెత్తి చూపింది.

మతోన్మాద శక్తుల దాష్టీకాలు
నివేదికలో నెలవారీగా కూడా విశ్లేషణలు జరిగాయి. దేశంలో ప్రతి నెలలోనూ కనీసం 80 వరకూ ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌లోనూ, ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఈ తరహా నేరాల సంఖ్య బాగా ఎక్కువగా ఉందని నివేదిక ప్రస్తావించింది. గతేడాది అక్టోబర్‌లో దాండియా/ గర్బాలో ముస్లిం పురుషులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం, లవ్‌ జిహాద్‌పై తప్పుడు ఆరోపణలకు సంబంధించిన కేసులే ఎక్కువగా వచ్చాయి. అదే నెల చివరి వారంలో ముస్లింల వ్యాపారాలను బహిష్కరించాలంటూ మతోన్మాద శక్తులు ప్రచారాన్ని లేవనెత్తాయి. ఆ నెలలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 21 విద్వేష నేరాల కేసులు నమోదు కాగా మధ్యప్రదేశ్‌లో 16, మహారాష్ట్రలో 11 వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం యువతను నవరాత్రి వేడుకలలో పాల్గొనకుండా నిరోధించిన ఘటనలు వెలుగు చూశాయి. వారిని వేధింపులకు గురిచేయడమో లేదా వారిపై దాడి చేయడమో జరిగింది. హిందూత్వ సంస్థలు ‘మత మార్పిడులు’ జరుగుతున్నాయంటూ పెద్దఎత్తున గగ్గోలు పెడుతున్నాయి. పాస్టర్లను బెదిరించడం, అరెస్టు చేయడం జరుగుతోంది. మహా రాష్ట్రలో హిందూత్వ శక్తులు చెలరేగిపోయి ముస్లింలపై దాడులు జరిపాయి. గో సంరక్షణ పేరుతో ముస్లిం వ్యాపారులను విచక్షణారహితంగా కొట్టారు. క్రైస్తవ ప్రార్థనా సమావేశాలను, ముస్లిం మత పెద్దల ప్రసంగాలను అడ్డుకున్నారు.

పర్వదినాల మాటున…
ఈ ఏడాది ఏప్రిల్‌లో 96 నేరాలు నమోద య్యాయి. వీటిలో ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 27 ఘటనలు జరిగాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ద్వేషపూరిత నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆ దాడి తర్వాత పలువురు ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపారు. ఏప్రిల్‌లో శ్రీరామనవమి వేడుకలతో పాటు ఈస్టర్‌ వేడుకలూ జరిగాయి. ఈ రెండు వేడుకల్లోనూ ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయని నివేదిక తెలిపింది. అహ్మదా బాద్‌, రాయగడ్‌లో ఈస్టర్‌ వేడుక లకు ఆటంకం కలిగిం చారు. ముంబయి, జోధ్‌పూర్‌ నగరాల్లో రామ నవమి ఊరే గింపుల సందర్భం గా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ద్వేష పూరిత ప్రసంగాలు, దాడు లు చేశారు. అదే నెలలో నైనిటాల్‌లో జరిగిన లైంగిక దాడి ఘటన మత హింసకు దారి తీసింది. గణేష్‌ చతుర్థి, నవరాత్రి, రామనవమి, హోలీ వంటి హిందూ పండుగలను మతోన్మాద శక్తులు ద్వేషపూరిత నేరాలకు పాల్పడేందుకు, మత సమీకరణకు ఉపయోగించుకుంటున్నాయి. రాజకీయ మద్దతు, మీడియా సహకారం, పోలీసుల నిష్క్రియాపరత్వం కారణంగా హిందూత్వ సంస్థలు మతపరమైన వేడుకలను మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి వాడుకుంటున్నాయని నివేదిక తెలియజేసింది. గతేడాది సెప్టెంబర్‌లో వినాయక చవితి సందర్భంగా హిందూత్వ సంస్థలు మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ముస్లింల నివాసాలను ధ్వంసం చేశాయి. ‘మూత్ర జిహాద్‌’ ఆరోపణతో ఓ ముస్లింపై దాడి జరిపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రామనవమి సందర్భంగా రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ముస్లింను బంధించినట్టుగా చూపే శకటాన్ని వీధుల్లో ఊరేగించారు. బార్మర్‌లో మసీదు, తెలంగాణలో మదర్సా ధ్వంసమయ్యాయి. రాజస్థాన్‌లోని కొన్ని గ్రామాలలోకి ముస్లింలు ప్రవేశించకుండా నిషేధించారు. ఉత్తరప్రదేశ్‌లోని భాగల్పట్‌లో హోలీ వేడుకలో పాల్గొనేందుకు నిరాకరించిన ముస్లింపై దాడి జరిగింది. బరేలీలో ముస్లిం బాలురు పార్కులోని ప్రవేశించకుండా అడ్డుకున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ హిందూత్వ శక్తులు ఇలాంటి విద్వేష చర్యలకు పాల్పడ్డాయి.

ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు
దేశంలో విద్వేష ప్రసంగాలు, నేరాలు పెచ్చరిల్లుతున్నప్పటికీ పోలీసులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతేడాది కాలంలో 602 ద్వేషపూరిత నేరాలు జరిగితే వాటిలో కేవలం 13 శాతం నేరాలపైనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూరులో పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ క్రైస్తవ మత బోధకుడిపై బజరంగ్‌దళ్‌ సభ్యులు దాడి చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హాజరైన ముస్లింల ఐడీలను హిందూత్వ గ్రూపులు తనిఖీ చేస్తుంటే పోలీసులు వారికి సాయం చేశారు. హిందూత్వ శక్తులకు కొమ్ముకాస్తున్న మీడియా అగ్నికి ఆజ్యం పోస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది. పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల సమయంలోనే కాకుండా చివరికి స్థానిక ఎన్నికలలో కూడా ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది కాలంలో శాసనసభ ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లో నాలుగింటిలో బీజేపీ గెలుపొందింది. అయితే వీటన్నింటిలోనూ విద్వేష ప్రసంగాలు, నేరాలు ఎక్కువగానే జరగడం గమనార్హం. ఢిల్లీ, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో బీజేపీకి వాతావరణం అనుకూలంగా ఉండేలా విద్వేష ప్రసంగాలు, నేరాలతో ప్రజలను రెచ్చగొట్టారు.

న్యాయమూర్తులు, గవర్నర్‌ సైతం…
మహారాష్ట్రకు చెందిన నితేష్‌ రాణే వంటి నేతలు ఓ వ్యూహం ప్రకారం మసీదులలోకి ప్రవేశించి ముస్లింలను ఒక్కొక్కరిగా చంపేస్తామని బెదిరించారు. ముస్లింలకు వ్యతిరేకంగా పని చేసే వారికి మద్దతు ఇస్తానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బహిరంగంగానే ప్రకటించారు. ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలు చేసే వారిని ప్రధాని మోడీ సహా బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్‌ నేతలు వెనకేసుకురావడం ఆందోళన కలిగించే విషయం. గతేడాది కాలంలో నమోదైన 345 విద్వేష ప్రసంగాల్లో ఒక రాజకీయ పార్టీకి చెందిన వారివే 109 ఉండడం గమనార్హం. చట్టసభలకు ఎన్నికైన 139 మంది ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఈ ఏడాది కాలంలో ఇద్దరు న్యాయమూర్తులు, ఓ గవర్నర్‌ కూడా విద్వేష ప్రసంగాలు చేశారని నివేదిక తెలిపింది. విద్వేష ప్రసంగాలు, నేరాలపై గత సంవత్సరం హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ కూడా ఇలాంటి నివేదికనే విడుదల చేసింది. గతేడాది నమోదైన 345 విద్వేష ప్రసంగాల్లో బీజేపీ 178 ప్రసంగాలతో అగ్ర స్థానంలో నిలవగా వీహెచ్‌పీ నేతలు 21, బజరంగ్‌దళ్‌ నేతలు 20 ప్రసంగాలు చేశారు.
ప్రసంగాలు, నేరాల చిట్టా
నరేంద్ర మోడీ మూడోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో దేశంలో 947 ద్వేషపూరిత నేర ఘటనలు జరిగాయి. వీటిలో 345 విద్వేష ప్రసంగాలకు సంబంధించినవి కాగా మిగిలిన 602 నేరాలు. ఈ ద్వేషపూరిత నేరాల్లో 173 ఘటనలు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరిపిన భౌతిక దాడులకు సంబంధించినవి. ఈ సంఘటనల్లో పాతిక మంది ప్రాణాలు కోల్పోయారు. వారంతా ముస్లింలే కావడం గమనార్హం. అయితే ఈ ఘటనలు పాతిక మంది హిందువులను కూడా ప్రభావితం చేశాయి. వారు ప్రధాన బాధితులు లేదా లక్ష్యం కాకపోయినప్పటికీ ఘటనా స్థలంలో ఉండడంతో వారికి హాని జరిగింది. ముఖ్యంగా హిందూ మహిళలపైనే ఎక్కువ ప్రభావం పడింది. ఇక విద్వేష ప్రసంగాల విషయానికి వస్తే బీజేపీతో సంబంధమున్న 178 మంది ఆ ప్రసంగాలు చేశారని నివేదిక తెలియజేసింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్వేష నేరాల ఘటనలు ఎక్కువగా జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -