ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
లక్నో: హిందూ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, అప్రమత్తంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. హిందూ జనాభా తగ్గిపోవడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చేందుకు ఆలోచించాలని సూచించారు. మంగళవారం ఉత్తర్ప్రదేశ్ లక్నోలోని సరస్వతి శిశు మందిర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మత మార్పిళ్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని తెలిపారు. సామరస్యం లేకపోవడం వల్లే వివక్షకు కారణం అవతుందని, పౌరులందరూ ఒకే దేశం- ఒకే జన్మభూమి అనే భావన కలిగి ఉండాలన్నారు. మన సంస్కృతిలో పురుషులకు సంపాదించే హక్కు ఉంటుంది. అదే మన తల్లులకు దానిని ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. దేశంలోకి చొరబడే ఆక్రమణదారులను గుర్తించి, తిరిగి పంపించాలని మోహన్ భాగవత్ చెప్పారు. ముఖ్యంగా వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు.



