Wednesday, March 18, 2026
E-PAPER
Homeక్రైమ్కూకట్‌పల్లిలో హవాలా నగదు దారిదోపిడీ

కూకట్‌పల్లిలో హవాలా నగదు దారిదోపిడీ

- Advertisement -

– 24 గంటల్లో దొంగల ముఠా అరెస్ట్‌
– చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులు
నవతెలంగాణ – కూకట్‌పల్లి

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భారీ దోపిడీ జరిగింది. రూ.కోటి హవాలా నగదు తీసుకెళ్తున్న వ్యక్తి కండ్లలో కారం కొట్టి దుండగులు రూ.కోటి నగదుతో పరారయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరగ్గా.. కేసును 24 గంటల్లో పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సహా నలుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.77.39 లక్షలు, ఫ్లైట్‌ టికెట్లు స్వాధీనం చేసుకున్నట్టు కూకట్‌పల్లి జోన్‌ డీసీపీ రీతీరాజ్‌ వెల్లడించారు. వివరాల్లోకెళ్తే.. బహదూర్‌పురాకు చెందిన ఖుస్రొద్దీన్‌ తన యజమాని పంపిన హవాలా నగదుపై కన్నేసి స్నేహితుడు ఒమర్‌ షరీఫ్‌ గ్యాంగ్‌తో కలిసి దోపిడీకి ప్రణాళిక రూపొందించాడు. సోమవారం రాత్రి ఖుస్రొద్దీన్‌ కోటి రూపాయలు తీసుకుని వెళ్తుండగా ముందస్తు పథకం ప్రకారం నిందితులు వెంబడించారు. కూకట్‌పల్లి మెట్రో పిల్లర్‌ నెంబర్‌ 836 వద్ద నిందితులు అతని కండ్లల్లో కారంపొడి చల్లి నగదు దోచుకుని పరారయ్యారు. అదే సమయంలో కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో, సీసీటీఎన్‌ఎస్‌ విభాగం కానిస్టేబుల్‌ సీఐ సుబ్బారావుకు సమాచారం అందించాడు. ఈ మేరకు కూకట్‌పల్లి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నిందితులు వదిలేసిన హోండా యాక్టివా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉన్నట్టు గుర్తించి, వారు లక్నో పారిపోవడానికి ముందే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒమర్‌ షరీఫ్‌, గౌస్‌ సద్దాం, హమీద్‌, ఖుస్రొద్దీన్‌ ఉన్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. ఈ కేసులో ఖుస్రొద్దీన్‌నే ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. 24 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన కూకట్‌పల్లి, సీసీఎస్‌ పోలీసులను డీసీపీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -