అంధకారంలో మంచిర్యాల ప్రభుత్వం ఆసుపత్రి
నవతెలంగాణ – మంచిర్యాల : జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జెనరల్ హాస్పిటల్ కరెంటు సమస్యతో విలవిలలాడుతోంది. టార్చ్ లైట్ లు, సెల్ఫోన్ల వెలుతురులో సిబ్బంది వైద్యం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గురువారం రాత్రి విద్యుత్ లో అంతరాయం ఏర్పడింది. సమయానికి జనరేటర్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో దాదాపు 20 నిమిషాల పాటు కరెంటు రాలేదు. దీంతో పెషేంట్ లు, సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఇది ఏదో ఈ ఒక్కరోజు ఏర్పడ్డ సమస్య కాదు.. నిత్యం వెంటాడుతున్న సమస్యే.
అయినా శాశ్వత పరిష్కారం కోసం అధికారులు పట్టించుకోవడం లేదని ఆస్పత్రికి వచ్చిన రోగులు వాపోతున్నారు. మంచిర్యాలతో పాటు పక్క జిల్లాల నుండి నిత్యం రోగులు ఈ హాస్పిటల్ కు చికిత్స కోసమని వస్తుంటారు. అలాంటి హాస్పిటల్ లో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సమయానికి స్పందించే వారే లేరంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ, వెంటిలేటర్ లపై ఎవరైనా పేషంట్ లు ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలవాల్సిందేనా స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
