నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న విచారణ వాయిదా పడింది. ఈ భూములకు సంబంధించి దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై (పిల్) విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
వివరాల్లోకి వెళితే, కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద భూములను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీజీఐఐసీ) అప్పగించింది. ఈ భూములను అభివృద్ధి చేసి, ఐటీ కంపెనీలకు కేటాయించేందుకు టీజీఐఐసీ ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఈ క్రమంలో, సదరు భూములను యంత్రాలతో చదును చేసే పనులు ప్రారంభించడంతో, ఈ చర్యలను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా, టీజీఐఐసీకి భూములను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే, కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలో ఉందని ధర్మాసనం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున, ఇక్కడ విచారణను కొనసాగించడం సమంజసం కాదని భావించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో ఈ భూముల భవితవ్యంపై మరికొంత కాలం సందిగ్ధత కొనసాగనుంది.