– ముంచెత్తిన వరద
– లోతట్టు ప్రాంతాలు జలమయం
– బోట్ల సహాయంతో పలువురిని బయటకు తీసుకొచ్చిన హైడ్రా
– జిల్లాల్లోనూ వర్షాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వర్షం కురిసింది. హైదరాబాద్ రోడ్లపై వరదలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాలల్లో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. పాఠశాలలు వదిలే సమయం కావడంతో వర్షం, వరదలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్తోపాటు పలు ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బోట్ల సహాయంతో స్థానికులను అధికారులు రక్షించారు. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. మలక్పేట్, మూసారంబాగ్తోపాటు టోలిచౌకి నానల్ నగర్ జంక్షన్ వద్ద నాలా పొంగిపొర్లింది. ఐటీ కారిడార్లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. మెర్క్యూరీ హౌటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. నాచారంలో భారీ వరదకు ఆటో కొట్టుకుపోయింది. పీవీ ఎక్స్ప్రెస్ భారీగా ట్రాఫిక్ జామైంది. భారీ వర్షాలతో అప్రమత్తమైన మాన్సూన్, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలో పాల్గొన్నాయి. సికింద్రాబాద్లోని పైగాకాలనీ నీట మునగడంతో హైడ్రా, అగ్నిమాపక బృందాలు కాలనీ వాసులను రక్షించాయి. ఓ కార్ల షోరూమ్లో నీరు చేరడంతో 30 మంది కార్మికులను పడవల సాయంతో రక్షించారు.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES