నవతెలంగాణ-హైదరాబాద్ : ఉమ్మడి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలను భారీ వర్షం అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి పట్టణం నీటమునిగింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేసింది. గురువారం కూడా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకురావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్, కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదావేశారు. శుక్రవారం జరగాల్సిన పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. ఇక నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెం.మీ., సర్దాన (మెదక్)లో 30.2 సెం.మీ., కామారెడ్డి టౌన్ 28.9 సెం.మీ., బిక్నూర్ (కామారెడ్డి) 27.9 సెం.మీ., వడ్యాల్ (నిర్మల్) 27.9 సెం.మీ., తాడ్వాయి (కామారెడ్డి) 27.5 సెం.మీ, నాగాపూర్ (మెదక్) 26.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాత రాజంపేట 24.6 సెం.మీ, లింగంపేటలో 22.5 సెం.మీ, దోమకొండలో 20.2 సెం.మీ, నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేట్లో 24.1 సెం.మీ, ముజిగిలో 23.1 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.