ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో అన్ని నదులు ఉధృత స్థాయిలో ప్రహిస్తున్నాయి. ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు (24 గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ) కురిసే అవకాశం ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (భారీ నుంచి అతి భారీ వర్షాలు) జారీ చేసింది. మొత్తంగా 14 జిల్లాల్లోనూ శనివారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కనీసం జూన్ 3 వరకూ కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, గత వారం రోజుల్లో కేరళలో ‘అధిక వర్షపాతం’ నమోదయిందని ఐఎండీ తెలిపింది. సాధారణంగా ప్రతీఏటా కేరళకు జూన్ 1వ వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ సారి మే 24నే కేరళలో ప్రవేశించాయి. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లో క్రమంగా బలహీనపడి, తదుపరి 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఐఎండీ తెలిపింది.
కేరళలో కొనసాగుతున్న భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -