నవతెలంగాణ హైదరాబాద్: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఈ ప్రభావం కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
_ మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. శనివారం వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదే పరిస్థితులు 11వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.