హైకోర్టు సంచలన తీర్పు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైకోర్టు చరిత్రలో తొలిసారిగా హీరా గ్రూప్ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్కు అక్షరాలా రూ. 5 కోట్ల జరిమానా విధిస్తూ జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం తీర్పు చెప్పారు. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు రూ.5 కోట్ల జరిమానాను 8 వారాల్లో ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్కు చెల్లించాలన్నారు. హీరా గ్రూప్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెద్ద ఎత్తున లాభాలతో తిరిగి చెల్లిస్తామని నమ్మించి జనాన్ని మోసం చేసిందనే కేసులో నౌహీరా షేక్పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు హీరా గ్రూప్ ఆస్తులను వేలం వేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఈడీ ఆస్తుల వివరాలను వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసింది. అత్యంత విలువైన తమ ఆస్తులను ఈ నెల 26న వేలం వేయకుండా స్టే ఉత్తర్వులను జారీ చేయా లంటూ నౌహీరా షేక్ లంచ్మోషన్ పిటిషన్ వేయడంపై న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కోర్టు సమయాన్ని వృధా చేయడమేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆస్తులను వేలం వేసేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింద న్నారు. కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించి నందుకు రూ.5 కోట్లు జరిమానాను ప్రధానమంత్రి రిలీఫ్ పండ్కు చెల్లించాలన్నారు.
డీజీపీ నియామకంపై పిటిషన్
రాష్ట్ర డీజీపీగా బి.శివధర్రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డీజీపీగా శివధర్రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సోషల్ వర్కర్ ధన్గోపాల్ రావు వేసిన పిటిషన్ను జస్టిస్ పుల్లా కార్తీక్ విచారించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2025న ప్రభుత్వం జారీ చేసిన డీజీపీ నియామక ఉత్తర్వులు 2018 లో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్లైన్స్కు వ్యతిరేకమని పిటిష నర్ వాదన, డీజీపీ రిటైర్ అవ్వడానికి ముందే అర్హులైన వాళ్ల ముగ్గురి పేర్ల యూపీఎస్సీకి ప్రభుత్వం అందజేయాలని సుప్రీం కోర్టు ప్రకాష్ సింగ్ కేసులో తీర్పు చెప్పిందన్నారు. అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి ప్రతివాదన చేస్తూ, యూపీఎస్సీకి జాబితా పంపామన్నారు. కొర్రీలు రావడంతో జాప్యమైందన్నారు. ఈ దశలో పిటిషనర్ కల్పించుకుని మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేయాలని కోరగా అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.
సున్నం చెరువుపై సర్వే రిపోర్టు ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్లోని సున్నం చెరువు భూమిపై సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సర్వే విచారణ అధికారిగా నియమితులైన ఆర్డీవో హైడ్రా సహా ఉన్నతాధికారులకు ప్రభావానికి గురికారాదని చెప్పింది. స్వతంత్రంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలంది. సర్వే అధికారికి రంగారెడ్డి, మెదక్ మల్కాజిగిరి జిల్లాల నీటిపారుదల, సర్వే, భూ రికార్డులు, రెవెన్యూ శాఖల అధికారుతోపాటు జీహెచ్ఎంసీ అఫీసర్లు సహకరించాలని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేస్తూ జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ఉత్తర్వులను జారీ చేశారు.
తమకు నోటీ సులు జారీ చేయకుండా, ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోందంటూ మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇతరులు పిటిషన్లు వేశారు. చెరువు సమీపంలో హైడ్రా తవ్వకం పనులను కొనసా గిస్తోందని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. అదనపు అడ్వకేట్ జనరల్ మహమద్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ, పిటిషనర్ అరోపణలను తోసిపుచ్చారు. ధికారుల విచారణలో ఎఫ్టీఎల్, బఫర్జోన్లోలో విల్లాలున్నా కూడా కూల్చివే స్తామన్నారు. చెరువును పునరుద్ధరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాదనలపై స్పందించిన న్యాయమూర్తి, సర్వే నివేదికలో ఎవరిది తప్పు అని తేలినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పారు. విచారణను 23కి వాయిదా వేశారు.



