హెలెన్ కెల్లర్ అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా నిలిచి ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తి నింపారు.అవయవాలు సక్రమంగా ఉన్నవారందరి కంటే మహోన్నత స్థాయిలో నిలిచారు. పట్టుదలతో సాధించలేనిదేదీ లేదని తన జీవితం ద్వారా నిరూపించారు. ”19వ శతాబ్దంలో అత్యంత శక్తిమంతులుగా ఆవిర్భవించిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు నెపోలియన్ అయితే రెండవవారు హెలెన్ కెల్లర్” అని ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వయిన్ పెర్కొన్నారు. హెలెన్ కెల్లర్ వికలాంగుల కోసమే కాకుండా మహిళల హక్కుల గురించి పత్రిక రచనలు చేసి వాటి సాధనకు స్వయంగా ఉద్యమాలు నడిపిన ధిశాలి. 22ఏండ్ల వయసులోనే ”ది స్టోరీ ఆఫ్ మై లైఫ్” గ్రంథ రచనతో పుస్తక రచనలకు శ్రీకారం చుట్టి వందలాది వ్యాసాలు, ప్రసంగాలు చేసి 14 పుస్తకాలు రాశారు. వికలత్వానికి, అంధత్వానికీ మూలం పేదరికమనీ, అదిలేని సమాజ స్థాపన ద్వారా వికలాంగుల సమస్యల పరిష్కారం కాదని, సమ సమాజ స్థాపన ద్వారానే సాధ్యమనీ ధృఢంగా విశ్వసించిన మానవతామూర్తి.
హెలెన్ ఆడమ్స్ కెల్లర్ 1880 జూన్27న అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని టస్కాంబియా అనే పట్టణంలో జన్మించారు. పుట్టుకతో వైకల్యం సంభవించనప్పటికి 19 నెలల వయసులో స్కార్లేట్ ఫివర్ లేదా మెనింజ్కెటీస్ వ్యాధి వలన చూపు వినికిడి శక్తిని కోల్పోయి వికలాంగురాలయ్యారు. హెలెన్ కెల్లర్లోని సాధారణ తెలివితేటలకు, ఇతర అవయవాలకు, ఆరోగ్యానికి ఎలాంటి లోపం రాలేదు. మూడేండ్ల వయసులో ఉన్నప్పుడు ఒకరోజు గది వెచ్చదనం కోసం ఉంచిన పొయ్యి దగ్గరకు చేరుకోవడంతో ఆమె బట్టలంటుకుని కనుబొమ్మలు, జుట్టు, నుదురు కాలాయి. ఈ సంఘటనతో చలించిపోయిన తల్లిదండ్రులు మరింత దిగులుపడ్డారు. బాల్టమోర్ పట్టణంలోని ప్రఖ్యాత నేత్ర వైద్యున్ని సంప్రదించగా ”చూపు వచ్చే అవకాశం లేదు గానీ, మెదడులోని నరాలన్నీ చాలా చురుకుగా పనిచేస్తున్నాయని సూచించి వాషింగ్టన్లోని అలగ్జాండర్ గ్రాహంబెల్ వద్దకు తీసుకెళ్లమని” సలహా ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన గ్రాహంబెల్ భార్యకు దారుణమైన చెముడు. ఆమెకు మాటలు నేర్పే పట్టుదల, అవిరామ ప్రయత్నాల ఫలితమే టెలిఫోన్ ఆవిష్కరణ. గ్రహంబెల్ సలహాతో అంధులకు విద్య నేర్పే ”పెర్కిన్స్ ఇనిస్టిట్యూట్” యాజమాన్యాన్ని ఇంటి వద్దే విద్య నేర్పేందుకు పంపమని కెల్లర్ తండ్రి అభర్థించారు. పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోనే మొదటిసారిగా బధిరులు, అంధులు మాట్లాడుకోవడం, రాయడం నేర్చుకున్న మొదటి వ్యక్తి లారా బ్రిడ్జియన్. పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్లో హెలెన్ కెల్లర్కు జీవితకాల ఉపాధ్యాయురాలిగా అన్నెసలీవన్ను నియమించారు.
బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అంధుల సేవకు అంకితమైన సలీవాన్ అధ్యాపకురాలిగా నియమితమవడం ప్రపంచ వికలాంగుల చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. దృష్టి లేని జీవితం వృథా అని భావించే సమాజానికి వెలుగులు నింపే క్రాంతి కిరణాలను అందించింది. జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైన మూడూ లోపించిన కెల్లర్ విద్య నేర్చుకుంటారని ఎవరూ ఊహించలేదు. కానీ అన్నెసలీవాన్ దాన్ని సాధ్యం చేశారు. బొమ్మను చేతికి ఇస్తే సూక్ష్మ గ్రాహి అయిన కెల్లర్ వెంటనే ఆమె చేతిమీద ”డాల్” (బొమ్మ) అని తిరిగి రాశారు. కెల్లర్ తన జీవితంలో నెర్చుకున్న మొదటి పదమూ ఇదే. ఎ.బి.సి.డి.లను చేతిమీద రాసి చూపడం ప్రారంభమైన తర్వాత కెల్లర్ అచంచలమైన ఆత్మ విశ్వాసంతో టీచర్ బోధనలను అర్ధం చేసుకుని నిరంతరం సాధన చేశారు. ప్రతి వస్తువు పేరును హెలెన్ కెల్లర్ అరచేతిపై రాయడం వలన అక్షరాలను తడిమి చూసి గుర్తుపట్టేవారు. ఒకసారి కరచలనం చేస్తే ఆ స్పర్శ ద్వారా ఆ వ్యక్తిని చాలా కాలం తర్వాత కూడా గుర్తుపట్టేవారు. భారతదేశం వచ్చిన సందర్భంలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గళంలోని సంగీత మాధుర్యాన్ని, ఈమె తన చేతి వేళ్లద్వారా ఆమె గొంతును తాకుతూనే నిర్థారించగలిగారు. మనిషి నడుస్తున్నప్పుడు సహజంగా ఏర్పడే భూప్రకంపనాల తారతమ్యాలను అనుసరించి ఆ వ్యక్తి సహజ స్వభావాన్ని అంచనా వేసేవారు. ఈ తరహాలో అనేక అద్భుత మానసిక శక్తులతో ప్రపంచ దేశాలన్నిటినీ ఆకట్టుకుని, వికలాంగుల సేవా కేంద్రాలను నెలకొల్పేందుకు కృషి చేశారు. ఇవన్నీ హెలెన్ కెల్లర్ గొప్ప మేథో శక్తికి నిదర్శనాలు.
తన జీవితాన్ని అంధుల సేవకు స్వచ్ఛందంగా అర్పించుకొని, అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్ల్ల్తెండ్ సంస్థను స్థాపించి, దాని నిధి సేకరణకు ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. సమావేశాలు, సదస్సులు నిర్వహించాడు. భారీ స్థాయిలో నిధులు సేకరించి వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేశారు.వికలాంగులను దయాదాక్షిణ్యాలతో పోషించటం కాదని వారు స్వశక్తితో నిలబడేందుకు అవకాశాలు కల్పించి వారిలో ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం కల్పించడమే పరిష్కా రమని కెల్లర్ ప్రగాఢంగా విశ్వసించారు. ఆదర్శవంతమైన సార్థక సేవా దృక్పధానికీ బీజం వేశారు. జీవితాంతం వికలాంగులు, అంధులు,బధిరులకు అండగా నిలిచారు.
(జూన్ 27 హెలెన్ కెల్లర్ జయంతి)
ఎం.అడివయ్య
9490098713