నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆయన భార్య పేరు రాయలేదనీ, ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలన్న పిటిషనర్ (ఓటరు) నందూనాల్ అభ్యర్థనను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. భార్య పేరు రాయకపోతే, కూనంనేని ఎన్నిక చెల్లకుండా పోతుందా?అని ప్రశ్నించింది. భార్యకు చెందిన అయిదేండ్ల ఆదాయపు పన్ను రిటర్నులు, ఆస్తులు, అప్పుల వివరాల గురించి కూనంనేని పేర్కొన్నారని గుర్తు చేసింది. కేవలం ఆయన భార్య పేరు అఫిడవిట్లో వెల్లడించనంత మాత్రాన ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించలేమని స్పష్టం చేసింది. కూనంనేని 26,547 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారనీ, ఓటర్ల విశ్వసనీయతను పొందారనీ, ప్రజా తీర్పును కాదనేందుకు కూనంనేని ఆయన భార్య పేరు రాయలేదనే కారణం చెల్లదని పేర్కొంది. కూనంనేని నామినేషన్ దాఖలు సందర్భంగా భార్య పేరు వెల్లడించకపోవడంపై పిటిషనర్ ఏవిధమైన అభ్యంతరం చెప్పలేదనీ, ఆయనపై పోటీ చేసిన ప్రత్యర్థి జలగం వెంకటరావు ఇదే విషయం అభ్యంతరం లేవనెత్తితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారని గుర్తు చేసింది.
– న్యాయం గెలిచింది: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
తన ఎన్నిక చెల్లందంటూ వేసిన ఎన్నికల పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం పట్ల కొత్తగూడెం శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ప్రజాక్షేత్రంలో గెలుపొందడం ద్వారా ప్రజా విజయం సాధించామని ఆయన తెలిపారు. తాజాగా అసంబంధమైన అంశాలతో వేసిన కేసును హైకోర్టు కొటేయడం ద్వారా న్యాయం గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థ పట్ల మరింత విశ్వాసం, గౌరవం ప్రజల్లో పెరిగిందన్నారు. లక్షలాది మంది ఓట్లు వేసి గెలిపించిన వారి మనోభావాలకు భిన్నంగా అడ్డదారుల్లో ప్రయోజనం పొందాలనుకునేవారికి ఈ తీర్పు చక్కని గుణపాఠమన్నారు. అందుకు న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పు ప్రజా సేవలో ద్విగుణీ కృతమైన ఉత్సహంతో పనిచేసేందుకు మరింత స్పూర్తిని కలిగించిందని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
కూనంనేని ఎన్నిక చెల్లదన్న పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES