అమరావతి : తిరుపతిజిల్లా, రంగంపేటలోని మోహన్ బాబు యునివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని, విద్యార్థుల నుండి రూ.26.17 కోట్ల మేరకు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఎపి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. యునివర్సిటీ పరిపాలనా బాధ్యతలను శ్రీవెంకటేశ్వర యునివర్సిటీ వైస్ ఛాన్సలర్/ రిజిస్ట్రారుకు అప్పగించాలన్న ఆదేశాలను కూడా నిలుపుదల చేస్తూ వెలువరించిన మధ్యంతర ఉత్తర్వలను అధికారిక వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. మోహన్బాబు యునివర్సిటీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను పరిష్కరించినట్లుగా జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాన పిటిషన్పై విచారణను ఈ నెల 14కి వాయిదా వేశారు, మోహన్బాబు యునివర్సిటీ గుర్తింపు రద్దు చేయడంతో పాటు పలు చర్యలకు సిఫార్సు చేస్తూ ఎపి ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గత నెల 17న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. వీటిని రద్దు చేయాలంటూ యునివర్సిటీ రిజిస్ట్రార్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఉత్తర్వుల్లోని పలు అంశాలపై గత సెప్టెంబర్ 26న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేసిన రూ.26.17 కోట్లను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని, ఇతర అంశాలపై సిఫార్సులను కూడా నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అయితే, మధ్యంతర ఉత్తర్వుల తర్వాత యునివర్సిటీ గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను ఎపి హెచ్ఆర్ఎంసి అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని మోహన్బాబు వర్సిటీ అనుబంధ పిటిషన్ వేయడంతో గురువారం ఈ మేరకు ఉత్తర్వులను వెలువరించింది.
మోహన్బాబు యూనివర్శిటీ రద్దు సిఫారసుల అమలుపై హైకోర్టు స్టే
- Advertisement -
- Advertisement -