పంటల మార్పిడి పై రైతులు దృష్టి పెట్టాలి
పంటలను కాపాడేందుకు లింగాకర్షణ బుట్టలు దోహదపడతాయి
సీఐపీఎంసీ సునీత
నవతెలంగాణ-పాలకుర్తి
సమగ్ర సస్యరక్షణ చర్యలతో పంటల అధిక దిగుబడులను పొందవచ్చని సీఐపీఎంసీ ఇన్చార్జి రౌతు సునీత రైతులకు సూచించారు. కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ సహకారంతో మండల వ్యవసాయ అధికారి రేపాల శరత్ చంద్ర ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో గల రైతు వేదికలో పంటల సత్య రక్షణ, పురుగుల నివారణ అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్లాంటు ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, పాలకుర్తి డివిజన్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి ఉదయ్ శంకర్, బసవనప్ప తో కలిసి సునీత రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు సాగు చేసే పంటలలో సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటలను కాపాడుకోవాలని సూచించారు. పంటల సాగు ప రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం కృషి చేస్తుందని తెలిపారు.
వ్యవసాయం లో పంట మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలని తెగుళ్లను తట్టుకునే వంగడాలను సాగు చేయాలని సూచించారు. విత్తన శుద్ధి రక్షణ కవచం లాంటిదని, వేరుకుళ్ళు, ఇతర తెగుళ్ల నుండి పంటలను 10 శాతం వరకు కాపాడుకోవచ్చు అని రైతులకు వివరించారు. బయోపిస్టిసైడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. పంటల సాగులో మొక్కకు మొక్క దూరం పాటించాలని వివరించారు. మట్టి పరీక్షల ఫలితాలతో ఎరువులు వాడుకోవాలని రైతులకు సూచించారు. వరిలో కాలిబాట ఉండే విధంగా రైతులు దృష్టి పెట్టాలన్నారు. ప్రతి రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి పంటల్లో సత్యరక్షణ చర్యలు ప్రారంభించి అధిక దిగుబడులు పొందే విధంగా కృషి చేయాలన్నారు. యాంత్రికరణ పద్ధతులను అవలంబించాలని, పంటలను కాపాడుకోవాలని సూచించారు.
పంటలను నాశనం చేసే శత్రు పురుగులను నివారించేందుకు జిగురు బట్టలు ఏర్పాటు చేసుకోవాలని, లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయడంతో మిత్ర పురుగులను కాపాడుకోవచ్చని సూచించారు. గులాబీ రంగు పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. రసాయన ఎరువుల వాడకంతో మిత్ర పురుగులకు నష్టం వాటిల్లుతుందని, మిత్ర పురుగులను నష్టం కలిగించే రసాయన ఎరువులను వాడకూడదని సూచించారు. ఐపిఎం పద్ధతులను ప్రతి రైతు పాటించినప్పుడే పంటలను కాపాడుకోవచ్చని, అధిక దిగుబడును పొందవచ్చని సూచించారు. అనంతరం క్షేత్ర సంఘర్షణ నిర్వహించి లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి వాటి వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలను కాపాడుకునేందుకు రైతులకు ఎన్ పి ఎస్ స్ మొబైల్ యాప్ పట్ల అవగాహన కల్పించారు. పంటల సస్యరక్షణ కోసం యాప్ను ఏ విధంగా వాడాలో రైతులకు వివరించారు. మొబైల్ యాప్ తో పంటలను కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ జాటోతు రాధిక, రైతులు విష్ణువర్ధన్ రెడ్డి, నాగిరెడ్డి, సోమయ్య, ఎరువుల దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.