Tuesday, April 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసూర్యాపేటకు హైస్పీడ్‌ రైలు

సూర్యాపేటకు హైస్పీడ్‌ రైలు

- Advertisement -

రెండు రైల్వే లైన్లకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

సూర్యాపేట ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమైంది! కేంద్ర రైల్వే శాఖ సూర్యాపేట మీదుగా రెండు రైల్వే లైన్లకు ఆమోదం తెలిపింది. సూర్యాపేట మీదుగా డోర్నకల్‌-గద్వాల రైల్వే లైన్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది నల్లగొండకు రైల్వే కనెక్టివిటీని మెరుగు పరుస్తుంది. సుమారు రూ.5,330 కోట్ల అంచనా వ్యయంతో జరిగే ఈ ప్రాజెక్ట్‌, సిమెంటు, గ్రానైట్‌ పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చడం తోపాటు, సూర్యాపేటలో దశాబ్దాల రైల్వే కల నెరవేరనుంది. అత్యాధునిక హైస్పీడ్‌ రైలు మార్గం శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు సూర్యాపేట మీదుగా వెళ్లనుంది. డోర్నకల్‌-గద్వాల రైల్వే లైన్‌ నిర్మాణానికి కూడా అను మతి లభించింది.

రెండు రైల్వే లైన్లు
సూర్యాపేట వాసులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైంది. త్వరలోనే సూర్యాపేట మీదుగా రెండు రైల్వే లైన్లు రానున్నాయి. దీనికి కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కింద శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్‌ ఫైనల్‌ లోకేషన్‌ సర్వే(ఎఫ్‌ఎల్‌ఎస్‌)లో భాగంగా సూర్యాపేట, నల్లగొండ మీదుగా డోర్నకల్‌-గద్వాల లైన్‌కు కేంద్ర రైల్వే శాఖ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. సూర్యాపేట జిల్లా కేంద్ర రైల్వే కనెక్టివిటీ కోసం పరిసర ప్రాంత ప్రజలు ఎన్నో ఏండ్ల్లుగా ఎదురు చూస్తున్నారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ గతంలో చాలా సార్లు.. కొత్త రైల్వే లైన్లను పత్రిపాదించినా పట్టాలెక్కలేదు. ఇటీవల రైల్వే శాఖ.. విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా శంషాబాద్‌ వరకు, అలానే విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్‌ వరకు హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ కోసం ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే చేపట్టింది. ఈ సర్వే గతేడాది చివరలో పూర్తయింది. దీంతో దానిని ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో పొందుపరిచింది. ఇలా పొందుపరిచిన కొత్తలైన్‌ ఎఫ్‌ఎల్‌ఎస్‌కు కేంద్రం రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది కార్యరూపం దాల్చితే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్‌ రైలు సేవలు సూర్యాపేట వాసులకు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు డోర్నకల్‌-గద్వాల వరకు 296 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌లో భాగంగా సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి మీదుగా గద్వాల వరకు ఎఫ్‌ఎల్‌ఎస్‌కు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ పనుల కోసం రూ.7.40 కోట్లు కేటాయించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడనుంది.

పెరగనున్న సేవలు
సికింద్రాబాద్‌ – విజయవాడ రైల్వే లైన్‌ ప్రాంతంలో ఈ కొత్తమార్గం సుగమం కావడంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు, త్వరితగతిన ప్రయాణం చేసే అవకాశాలు దక్కనున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, సికింద్రాబాద్‌, విజయవాడ రైలు మార్గాలను అనుసంధానం చేసేలా పనులు సాగుతున్నాయి.కొత్త రైల్వేలైన పూర్తయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు బెంగుళూరు వెళ్లడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -