సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు జితేంద్ర చౌదరి
గౌహతి : అసోంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పని చేస్తోందని సీపీఐ(ఎం) పాలిట్బ్యూరో సభ్యులు జితేంద్ర చౌదరి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 44వ నంబర్ గోరేశ్వర్ నియోజకవర్గ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి బాపురామ్ బోరోకు మద్దతుగా శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ అనుసరిస్తున్న ‘జుమ్లా’ (తప్పుడు వాగ్దానాల) రాజకీయాలను ఆయన ఎండగట్టారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల అభివద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. ‘హిమంత ప్రభుత్వం అసోం ప్రజల ఆత్మగౌరవాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెడుతోంది. ప్రజలను వారికి లొంగి ఉండేలా చేసేందుకు కుట్రలు చేస్తోంది’ అని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.



