హాకీ క్రీడాకారులకు క్రీడా పరికరాలను అందించిన సుభాష్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
గర్గుల్ గ్రామానికి చెందిన యువ హాకీ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా, తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్గుల్ గ్రామంలో హాకీ క్రీడల అభివృద్ధి కోసం అవసరమైన క్రీడా పరికరాల నిమిత్తం సుభాష్ రెడ్డి ని సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి ఎలాంటి ఆలస్యం లేకుండా క్రీడా పరికరాలను అందించారు. ఈ సమావేశంలో సుభాష్ రెడ్డి క్రీడాకారులను అభినందిస్తూ, గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగడం తనకు గర్వకారణమని తెలిపారు.
క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, క్రమశిక్షణ, నాయకత్వం, జట్టు భావన వంటి విలువలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో హాకీతో పాటు ఇతర క్రీడల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన మౌలిక వసతులు, క్రీడా పరికరాల కల్పనలో ముందుంటామని సుభాష్ రెడ్డి క్రీడాకారులకు హామీ ఇచ్చారు. యువ క్రీడాకారులు పట్టుదలతో సాధన కొనసాగిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, వారి లో నూతనోత్సాహాన్ని నింపారు.



