- Advertisement -
- ముంబయి పేల్చివేత మెసేజ్ పంపిన వ్యక్తి నోయిడాలో అరెస్టు
నోయిడా : తన స్నేహితుడిని తీవ్రవాద కేసులో ఇరికించేందుకే నొయిడాకు చెందిన జ్యోతిష్యుడు అశ్విని కుమార్ (51) ముంబయి పోలీసులకు ఆర్డీఎక్స్ బెదిరింపు మెసేజ్ పెట్టాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తనపై కేసు పెట్టి మూడు నెలలు జైలుకెళ్ళేలా చేసాడన్న కోపాన్ని రెండేండ్ల నుంచి మనస్సులో పెట్టుకున్న అశ్విని కుమార్ ప్రతీకారాన్ని తీర్చుకునే ఉద్దేశ్యంతో స్నేహితుడు ఫిరోజ్ పేరిట ముంబయి ట్రాఫిక్ పోలీసు అధికారిక వాట్సాప్ నెంబరుకు ఈ మెసేజ్ పంపాడు. 400కిలోల ఆర్డీఎక్స్తో 34 మానవ బాంబులు ముంబయి నగరంలోకి ప్రవేశించాయి. 34వాహనాల్లో వాటిని పెట్టి మొత్తంగా నగరాన్ని పేల్చివేస్తారు అనేది ఆ సందేశం సారాంశం. లష్కరే జిహాదీ సంస్థ నుంచి ఆ సందేశం వచ్చినట్టుగా వుంది. 14మంది పాక్ జాతీయులు భారత్లోకి ప్రవేశించారని కూడా చెప్పాడు. తప్పుడు సందేశం పంపినందుకు శనివారం తెల్లవారు జామున ముంబయి పోలీసులు నొయిడాలో కుమార్ను అరెస్టు చేశారు. పాట్నాకు చెందిన కుమార్ గత ఐదేళ్ల నుండి తల్లిదండ్రులతో కలిసి నొయిడాలో వుంటున్నాడు. 2023లో ఫిరోజ్ కారణంగా కుమార్ మూడు నెలలపాటు జైలుకెళ్ళాడు. దాంతో మనస్సులో ద్వేషం పెంచుకున్న కుమార్ ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. కుమార్ నుంచి పోలీసులు ఏడు మొబైల్ ఫోన్లను,మూడు సిమ్ కార్డులను, ఆరు మెమరీ కార్డులను, రెండు డిజిటల్ కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. వర్లి పోలీసు స్టేషన్లోకేసు నమోదైంది. క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది.
- Advertisement -