నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వరుస సెలవులు వచ్చాయి. ఓ వైపు ప్రభుత్వం ప్రకటించినవి, సాధారణ సెలవులు, బోనాల పండుగలు రావడంతో జూలై 19 నుంచి జూలై 21 వరకు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. రాష్ట్రంలో భారీగా వర్షాలు పడటంతో జూలై 19 శనివారం హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.
ఆ తర్వాత ఆదివారం సాధారణ సెలవు. ఇక సోమవారం బోనాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. ఇలా మూడు రోజులు స్కూల్స్ మూతపడ్డాయి. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో రేపు (బుధవారం) మళ్లీ స్కూల్స్, కాలేజీలు మూతపడే అవకాశం కనిపిస్తోంది.
వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 23న (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల కొరత వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చాయి.
ఈ బంద్కు అఖిల భారత యువజన సమాఖ్య మద్దతు తెలిపింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. అందువల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ బంద్ను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచించబడింది.