– క్వాలిఫయర్2కు ముంబయి ఇండియన్స్
– 20 పరుగులతో హార్దిక్ సేన ఘన విజయం
– ముంబయి 228/5, గుజరాత్ 208/6
నవతెలంగాణ-చంఢగీడ్ : ఐపీఎల్18 టైటిల్ రేసు నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది. సీజన్లో అత్యంత నిలకడగా రాణించిన గుజరాత్ టైటాన్స్ శుక్రవారం ముల్లాన్పూర్లో జరిగిన ఎలిమినేటర్లో ముంబయి ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ముంబయి ఇండియన్స్ క్వాలిఫయర్2కు చేరుకుంది. ఫైనల్లో చోటు కోసం పంజాబ్ కింగ్స్తో ముంబయి ఇండియన్స్ ఆదివారం అహ్మదాబాద్లో తలపడనుంది. 229 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్ టైటాన్స్ తడబాటుకు గురైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (1) ట్రెంట్ బౌల్ట్ బంతికి తొలి ఓవర్లోనే నిష్క్రమించినా.. ఓపెనర్ సాయి సుదర్శన్ (80, 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) ఓ ఎండ్లో నిలబడ్డాడు. కుశాల్ మెండిస్ (20), వాషింగ్టన్ సుందర్ (48, 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు), రూథర్ఫోర్డ్ (24) తోడుగా కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. ఆఖర్లో సాధించాల్సిన రన్రేట్ భారీగా పెరగటంతో లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడింది. రాహుల్ తెవాటియ (16 నాటౌట్), షారుక్ ఖాన్ (13) అంచనాలను అందుకోలేదు. 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులే చేసిన గుజరాత్ టైటాన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముంబయి ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (2/56), జశ్ప్రీత్ బుమ్రా (27/1), మిచెల్ శాంట్నర్ (1/10) వికెట్లు పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (81, 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లు), జానీ బెయిర్స్టో (47, 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఆరంభం అందించారు. సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) జోరు కొనసాగించగా.. ఆఖర్లో హార్దిక్ పాండ్య (22 నాటౌట్) 9 బంతుల్లోనే మూడు సిక్సర్లు సంధించి ముంబయి ఇండియన్స్కు భారీ స్కోరు అందించాడు. టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ (2/53), సాయి కిశోర్ (2/42) రెండేసి వికెట్లు పడగొట్టారు.
టైటాన్స్ ఇంటికి
- Advertisement -
- Advertisement -