Friday, May 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆశలు.. ఆకాంక్షలు…

ఆశలు.. ఆకాంక్షలు…

- Advertisement -

కాలచక్రం గిర్రున తిరుగుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. ఆ సందర్భంగా ఆందోళనలు.. డిసెంబరు 9న ప్రకటన, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, అనంతరం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం…ఇవన్నీ మన కండ్ల ముందు జరిగిన సంఘటనలే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి అప్పుడే 11 ఏండ్లు పూర్తయ్యాయి. జూన్‌ 2న 12వ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకోబో తున్నాం. ఈ క్రమంలో నిజంగా ఆనాటి ప్రజల ఆశలు.. ఆకాంక్షలు నెరవేరాయా? ఏ ఉద్దేశంతోనైతే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారో, పాలకులు ఆ ఉద్దేశా లను, కోరికలను తీర్చగలిగారా? అంటే నిర్మొహ మాటంగా ‘లేదు.. కాదు…’ అనే సమాధానమే వస్తోంది.
గత బీఆర్‌ఎస్‌ పదేండ్ల ఏలుబడిలో ‘మేం చెప్పినవి చేశాం.. చెప్పనవి కూడా చేశాం…’ అంటూ ఆనాటి పాల కులు గొప్పలు చెప్పుకున్నారు. తాము మ్యానిఫెస్టోలో పెట్ట ని అంశాలను కూడా అమలు చేశామంటూ వారు జబ్బలు చరుచుకున్నారు. కానీ దీర్ఘకాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలు, ఇతర పేదలకు అత్యంత ఆవశ్యకమైన మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య తదితరాలను వదిలేశారు. భూమి అనేది వ్యక్తి ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు ప్రతీక. కానీ కీలకమైన ఈ హామీని అటకెక్కించిన కేసీఆర్‌ సర్కారు… కార్పొరేట్లకు మాత్రం కారు చౌకగా భూములను అప్పగించింది. తెలంగాణ వస్తే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ వ్యవస్థే ఉండబోదంటూ చెప్పిన బీఆర్‌ఎస్‌… ఆ తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయటం కాదుగదా, కనీసం ఆయా కార్మికులు ధర్నా చేసుకునే వీల్లేకుండా ధర్నా చౌక్‌నే ఎత్తేసింది. ప్రభుత్వంపై ఒక్కపైసా భారం పడకపోయినా… కనీస వేతనాల జీవోలను సవరించేందుకు కేసీఆర్‌ సర్కారు ఇష్టపడలేదు. తెలంగాణలో ఆది నుంచీ కౌలు రైతుల సంఖ్య ఎక్కువ. అందుకే ఇక్కడ కౌల్దారీ చట్టం కూడా వచ్చింది. ఈ వాస్తవాన్ని విస్మరించిన గులాబీ బాస్‌… ‘ప్రభుత్వానికి అసలు కౌలు రైతులతో ఎలాంటి సంబంధమూ లేదు…’ అంటూ శాసనసభ సాక్షిగా బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాదు…’రైతు బంధు ఇస్తున్నాం గదా? ఇంక పంట నష్టపరిహారమేంది…?’ అంటూ ఆయన ఆగ్రహోదగ్రుడయ్యారు. పోడు రైతుల గోడును ఆ సారు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు.
కారు పార్టీ, ఆ ప్రభుత్వం సంగతిని పదేండ్లపాటు చూసి విసిగి వేసారిన తెలంగాణ ప్రజానీకం…ఒక్కసారి అవకాశమిచ్చి చూద్దామనే ఉద్దేశంతో హస్తం పార్టీకి అధికారాన్ని అప్పగించారు. అయితే ‘నమ్మి నానబోస్తే పుచ్చి పురుగులైనట్టు…’ గంతకు తగ్గ బంతలాగా నేటి కాంగ్రెస్‌ సర్కారు పరిస్థితి తయారైంది. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ…’ఆర్థిక పరిస్థితి’ పేరుతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చింది. ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు (భరోసా) ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంపు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం నెలకు రూ.2,500 సాయం, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు, పెండ్లయిన ఆడ పిల్లలకు తులం బంగారం లాంటి పథకాలను అమల్జేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌… ఇప్పుడు ‘నన్ను కోసినా, ఇంతకు మించి ఏం చేయలేను…’ అంటూ ఒకింత కాడి కింద పడేసినట్టుగా మాట్లాడటం విడ్డూరంగానే కాదు, వింతగానూ ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రాన్నేలిన ఏ ముఖ్యమంత్రి కేవలం ఏడాదిన్నర కాలంలో ఇంతలా నిరాశా, నిస్పృహలకు గురికాలేదనే రాజకీయ వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. బహుశా… ఇలాంటి కామెంట్ల నుంచి తప్పించుకునేందుకే కాబోలు ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలంటూ ప్రభుత్వం కొంగొత్త రాగం అందుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రభుత్వం… ఇలాంటి ఈవెంట్లను భుజానేసుకున్నది లేదు. కాకపోతే ఏదో ఒక నగరంలో ఆ ఈవెంట్‌ను నిర్వహించుకోవటానికి అనుమ తులివ్వటం తప్ప, తానే దగ్గరుండి, ఖర్చు భరించి చేసింది లేదు. అది ఒక్క తెలంగాణకే ‘సాధ్యమైంద’నే వ్యంగ్యాస్త్రాల ను అనేకమంది ఇప్పుడు విసురుతున్నారు. ఈ విషయంలో ‘అనుకున్న దొక్కటీ, అయినది ఒక్కటీ…’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం పాడుకోవటం తప్ప చేసేదేమీ లేదు.
ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక నినాదా లైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్‌ఎస్‌ మాదిరిగానే నేటి కాంగ్రెస్‌ వ్యవహరి స్తోంది తప్ప కొత్తదనమేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. నీళ్ల విషయంలో కేసీఆర్‌ సర్కార్‌ ఆర్భాటంగా కట్టిన కాళేశ్వరానికి అవినీతి మరకలు అంటటంతోపాటు పిల్లర్ల కుంగుబాట నేది ఆ పార్టీ అధినేత మెడకు చుట్టుకుంది. కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత ఒక్క ఎకరాకూ అదనంగా నీరివ్వలేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంపై కేసీఆర్‌ యుద్ధం ప్రకటిం చిందీ లేదు, రేవంత్‌ కాలు దువ్విందీ లేదు. నియా మకాలకు సంబంధించి అటు గులాబీ ప్రభుత్వం, ఇటు హస్తం సర్కార్‌… రెండూ జాబ్‌ క్యాలెండర్‌ను అటకెక్కించాయి. పదేండ్ల తన ఏలు బడిలో కేసీఆర్‌ అడపాదడపా కొన్ని నియామకాలు చేపట్టినట్టు వ్యవహరించి, మూడోసారి అధికారం లోకి వచ్చిన తర్వాత వాటికి నియామక పత్రాలు ఇస్తామని చెప్పి, అభాసుపాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన రేవంత్‌.. 2024 అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించి, ఇప్పటివరకూ అమలు చేయలేదు. మరి ప్రజల ఆశలు.. ఆకాంక్షలు నెరవేరినట్టా? నెరవేరనట్టా?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -