– ఉద్యాన అధికారి వేణుమాధవ్
నవతెలంగాణ – అశ్వారావుపేట : తొలకరి వచ్చేసింది. ఏ పంట సాగు చేసే రైతులు దానికి అనుగుణం అయిన వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. దేశీయ వ్యవసాయ విధానంలో కాలానుగుణంగా పంటలు సాగు ఉంటుంది.అయితే జూన్ నెలలో ఉద్యాన పంటలు అయిన పామాయిల్, మామిడి,జామ,అరటి,బొప్పాయి,మునగ టమాటా,వంగ,మిరప సాగులో మెలుకువలు,యాజమాన్యం పద్దతులు పై ఉద్యాన అధికారి సూచనలు సలహాలు.
పామాయిల్:
నీటి వసతి ఉన్నచో కొత్తగా సాగు చేసుకోవచ్చు. వర్షపాతం,భూమిలోని తేమ దృష్టిలో ఉంచు కొని పెద్ద చెట్లకు అయితే ఒక రోజుకు, ఒక చెట్టుకు 220 లీటర్లు నీటిని ఇవ్వాలి. పెద్ద వయస్సు ముదురు తోటల్లో ఎకరానికి 5 కి.గ్రా. యూరియా, 3 కి. గ్రా. డీఏపీ, 5 కి.గ్రా. ఎంఓపీ తో ఫెర్టిగేషన్ చేపట్టాలి. చిన్న వయస్సు లేత తోటల్లో మూడు సంవత్సరాల వరకు అబ్లేషన్ పరికరంతో అబ్లేషన్ (3 సంవత్సరాల లోపు మొక్కల్లో వచ్చే పూతను తీసేయడం) చేయాలి. మొవ్వ కుళ్ళు నివారణకు కార్బండిజమ్ 1 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి మొవ్వ ప్రాంతంలో (100 – 200 మీ.లీ.ద్రావణం) పిచికారీ చేయాలి. రైనో సీరస్ బీటిల్ నివారణ కొరకు 20 గ్రాముల ఫోరేట్ ఇన్ పర్ఫోరేటెడ్ పాకెట్ లను మొవ్వ లో ఉంచాలి. కాపు కు వచ్చిన తోటల్లో అల్యూమినియం పోల్ తో జత చేయబడిన కొడవలితో ఆయిల్ పామ్ గెలలు ను కోయాలి.
మామిడి:
మామిడిలో కాయ కోత పూర్తయిన తర్వాత అవకాశం ఉన్న తోటలలో నీటి తడి ఇవ్వాలి.
50 రోజుల విశ్రాంతి అనంతరం పూత కొమ్మ లు,చెట్ల లోపల అడ్డ దిడ్డంగా పెరుగుతున్న కొమ్మ లు, గొడుగు(చిటారు) కొమ్మ లను తీసి వేయాలి. కత్తిరింపులు చేసిన వెంటనే కోసిన భాగాలకు బోర్డో పేస్ట్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్ పూయాలి. తొలకరి తర్వాత తోటలను శుభ్రంగా దున్ని పాదులు చేయాలి.తొలకరి లోనే ఎకరాకు 10 కిలోల జీలుగ, 25 కిలోల జనుము విత్తనాలను మామిడి చెట్టు చుట్టూ చల్లి 45 – 50 రోజుల తర్వాత భూమిలో కలియదున్నాలి. బాగా చివికిన పశువుల ఎరువు (సుమారు 100 కిలోల) లేదా 10 కిలోల వర్మీ కంపోస్ట్ ఎరువు చెట్లకు వేసుకోవాలి. ఎరువులను చెట్టు ప్రధాన కాండం నుంచి 1.5 మీ. నుంచి 2 మీ.దూరంలో పాదుల్లో వేసుకోవాలి.
జామ:
ఒక్కో చెట్టు కి 60 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో యూరియా, 1.2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 750 గ్రామ్ ల మూరేట్ అఫ్ పోటాష్ ఎరువులను వేయాలి.
ఏక వార్షిక మునగ:
మునగ నారును పాలిథిన్ సంచుల్లో పెంచుకోవాలి. మధ్యస్థంగా విత్తు కున్న బహు వార్షిక రకాలైన మునగ ఈ నెలలో కాపు వస్తుంది.ఒక్కో మొక్క సంవత్సరానికి 500 – 600 కాయల వరకు (కాతనిస్తుంది) దిగుబడినిస్తుంది. వర్షాకాలంలో మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో వేరు కుళ్లు,కాండం కుళ్ళు తెగుళ్లను నివారించు కోవాలి.
అరటి :
అరటిలో ఎంపిక చేసిన రకానికి అవసరం అయిన దూరంలో 45 x 45 x 45 సెం.మీ. గుంతలు తీయాలి.మూడు మాసాల వయస్సు కలిగి,రెండు,మూడు కోతలు పడిన సూది పిలకలను వైరస్ తెగుళ్ళు సోకని ఆరోగ్యవంతమైన మొక్క తోటల నుంచి సేకరించాలి. పిలకలు నాటడానికి ముందు 200 – 250 గ్రామ్ ల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 0.5 – 1 కిలో వానపాముల ఎరువు లేదా 2 – 3 కిలోల చివికిన పశువుల ఎరువు గుంత నుంచి తీసిన మట్టితో బాగా కలియబెట్టాలి.
బొప్పాయి :
బొప్పాయిలో పిండి నల్లి ఉనికి గమనిస్తే డైమిథైయేట్ 2 మీ.లీ. + జిగురు పదార్థం 0.5 మీ.లీ. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ పురుగులను వ్యాప్తి చేసే చీమలను,వాటి పుట్టలను పొలం చుట్టూ గమనిస్తే నాశనం చేసి క్లోరిపైరిఫాస్ ద్రావణాన్ని 4 మీ.లీ./లీటర్ నీటికి కలిపి నేలను తడపాలి. టమాటో,వంగ, మిరప: టమాటా,వంగ,మిరప నారును ఎత్తైన నారు మడుల్లో లేదా ప్రోట్రేలలో పెంచాలి.కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడా లేదా 8 గ్రా. ట్రైకోడెర్మా విరిడి తో విత్తనశుద్ధి చేయాలి. నారు కుళ్లు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి నారు మళ్ల ను ముంపు గా తడపాలి. నారు మళ్ళలో రసం పీల్చే పురుగులను నివారించుకోవాలి.బెండ,గోరుచిక్కుడు,పొద చిక్కుడు,తీగ చిక్కుడు,బొబ్బర్లు,కాకర,బీర, దోస,పోట్ల,సొర,గుమ్మడి, బూడిద గుమ్మడి పంటలను నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవాలి. రోజు వారీ పనికి అవగాహన తోడైతే అనుభవం పెరుగుతుంది – హెచ్.ఓ వేణుమాధవ్ వ్యవసాయ సాగు దారులకు రోజువారీ పనిలో అవగాహన తోడైతే యాజమాన్యం పద్దతుల్లో నాణ్యత పెరుగుతుంది. తద్వారా పనుల్లో మెలకువ వస్తుంది.తక్కువ సమయంలో ఎక్కువ పనితో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.అందుకే ఈ సూచనలు పాటించి సాగులో నాణ్యత పెంచుకోవాలని రైతులకు మనవి.