– బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
– హుస్నాబాద్లో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేత
నవతెలంగాణ-హుస్నాబాద్
ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో హుస్నాబాద్ మండలానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు శుక్రవారం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్లలో హుస్నాబాద్ మండలానికి 40 ఇండ్లు మాత్రమే ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు ఏడాదికి 200 ఇండ్ల చొప్పున నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. పునాదులు పెద్దగా వేస్తే పైసలు రావని.. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇండ్లు నిర్మించాలన్నారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఒకవేళ అనర్హులకు ఇల్లు మంజూరైతే వాటిని రద్దుచేస్తామని చెప్పారు. లబ్దిదారులకు ఫ్రీ ఇసుక ట్రాక్టర్ కూపన్లు వస్తాయన్నారు. అంతేకాకుండా ఉపాధి హామీ పని కింద మరుగుదొడ్లు కూడా నిర్మించుకోవచ్చని తెలిపారు. ఇంకుడు గుంతలకు కూడా డబ్బులు ఇస్తారన్నారు. ఇండ్ల నిర్మాణానికి డబ్బులు కావాలని అనుకుంటే మహిళా సంఘాల నుంచి లక్ష రూపాయలు రుణం ఇస్తున్నట్టు చెప్పారు. ప్రజా సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ నియోజవర్గం మొత్తంలో డబుల్ రోడ్లు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరీమా అగ్రవాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మెన్ లింగమూర్తి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే ఇండ్లు నిర్మించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES