నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు నిర్మించుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ ఐ ఓ సి కార్యాలయంలో హుస్నాబాద్ మండలానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో హుస్నాబాద్ మండలానికి 40 ఇల్లు మాత్రమే ఇచ్చారన్నారు. నేడు ఏడాదికి 200 ఇళ్ల చొప్పున నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు.ఇళ్ల ఎంపికలో పేదలకు మాత్రమే ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు. 400 నుండి 600 ఫిట్ల లోపు ఇల్లు నిర్మించుకోవాలని, పునాదులు పెద్దగా వేస్తే పైసలు రావన్నారు. అనర్హులకు ఇల్లు మంజూరు అయితే అది క్యాన్సల్ అవుతుందన్నారు. ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి నిర్మాణానికి ఫ్రీ ఇసుక ట్రాక్టర్ కూపన్ లు వస్తాయన్నారు.ఇందులో కూడా బాత్రూం స్కీమ్ ఉందని, ఉపాధి హామీ కింద బాత్రూం నిర్మించుకోవచ్చన్నారు.
ఇంకుడు గుంతలకు ,ఇళ్ల నిర్మాణానికి పైసలు కావాలని అనుకుంటే మహిళా సంఘాల నుండి లక్ష రూపాయలు రుణం ఇస్తారన్నారు .మీ ఊర్లలో యువత ఖాళీగా ఉండకుండా శిక్షణ ఇచ్చేలా సెట్విన్ లో తీసుకోవాలన్నారు. నమూషి పడకుండా పనులు చేస్తూ జీవనోపాధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తామన్నారు. మీకు సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ ఇస్తున్నాం,65 వేల ఉద్యోగాలు ఇచ్చాం ,బస్ స్టాండ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. 150 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని ,డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజవర్గం మొత్తం ఎక్కడికక్కడ డబుల్ రోడ్డు నిర్మణం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రోడ్ల సమస్య ,తాగునీటి సమస్యలు లేకుండా చేశామని ,భూ పంచాయతీ లేకుండా భూ భారతి తీసుకొచ్చామన్నారు. ఇళ్లు పట్టాలు పొందిన లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి,జిల్లా కలెక్టర్ మను చౌదరి , అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, ఆర్ డి ఓ రామ్మూర్తి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.