పాలన మార్పు నుంచి ఇరాన్ సైన్యం నిర్మూలన వరకూ అన్నీ అబద్ధాలే
అమెరికా-ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో పాలన మార్పు, ద్రవ్యోల్బణం అంతం, రికార్డు స్థాయి పెట్టుబడులు, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ఆరోపణలతో సహా అనేక సాహసోపేతమైన వాదనలు చేశారు. అంతేకాక ఇరాన్ సైన్యం, నౌకాదళం పూర్తిగా నాశనమయ్యాయని, ఇరాన్లో పాలన మార్పు కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ భాగం అతిశయోక్తులు కాగా కొన్ని వాస్తవాలు వక్రీకరించబడ్డాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వాదనలపై వాస్తవాలేంటో తెలుసుకుందాం.
ట్రంప్ : ‘మేము ఎప్పుడూ పాలన మార్పు గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. పాత నాయకులు హతమయ్యారు. కొత్త నాయకత్వం మరింత వివేకవంతమైనది.’
వాస్తవం: అధ్యక్షుడు ట్రంప్ వాదన పూర్తిగా అబద్ధం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభంలో జరిగిన దాడిలో సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత అధికారాన్ని ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీకి అప్పగించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొజ్తబా ఖమేనీ మునుపటి కంటే మరింత యుద్ధోన్మాదిగా పరిగణించబడుతున్నాడు. అంతేకాకుండా, ఈ యుద్ధ సమయంలో ఐఆర్జీసీ (రివల్యూషనరీ గార్డ్) ప్రభావం పెరిగింది. సైనిక నిర్ణయాలపై తమకు పరిమిత నియంత్రణ మాత్రమే ఉందని ఇరాన్ పౌర ప్రభుత్వమే స్వయంగా అంగీకరిస్తోంది. దీని అర్థం, ”పాలన మార్పు” అనే వాదన క్షేత్రస్థాయి వాస్తవానికి విరుద్ధంగా ఉంది.
ట్రంప్ : ‘తమ ప్రభుత్వం ఇటీవల 45వేల మంది నిరసనకారులను చంపింది’
వాస్తవం: ఇరాన్లో చంపబడిన నిరసన కారుల సంఖ్య ధవీకరించబడలేదు. ఒక ఏపీ నివేదిక ప్రకారం.. జనవరి నాటికి సుమారు 7వేల మరణాలు ధవీకరించబడ్డాయి. ఇరాన్ ప్రభుత్వం 3,117 మరణాలు సంభవిం చాయని ఒక సంఖ్యను ఇచ్చింది. అదనంగా, 53,000 పైగా అరెస్టులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ట్రంప్ చెప్పిన 45,000 సంఖ్య ప్రస్తుత గణాంకాల కంటే గణనీ యంగా ఎక్కువ, దానిని సమర్థించడానికి ఎటువంటి నిర్దిష్టమైన ఆధారాలు అందించబడలేదు.
ట్రంప్ : ‘అమెరికాకు మధ్యప్రాచ్య చమురు అవసరం లేదు’
వాస్తవం: అమెరికా అధ్యక్షుడి వాదన పాక్షిక సత్యం మాత్రమే. 2025లో, అమెరికా తన మొత్తం చమురు దిగుమతులలో కేవలం 8.5 శాతం మాత్రమే పర్షియన్ గల్ఫ్ నుంచి పొందింది. అయితే, చమురు ఒక ప్రపంచ మార్కెట్. మధ్యప్రాచ్యంలోని సంక్షోభం ప్రపంచ ధరలపై ప్రభావం చూపుతుంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, ముడి చమురు ధరలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. అమెరికాలో పెట్రోల్ ధరలు గ్యాలన్కు 4 డాలర్లకుపైనే దాటాయి. దీని అర్థం, ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికీ, దాని ప్రభావం కచ్చితంగా ఉంది.
ట్రంప్ : ‘రికార్డు స్థాయిలో 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు యునైటెడ్ స్టేట్స్లోకి వచ్చాయి.
వాస్తవం: అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం… ఈ వాదనను సమర్థించడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు. వైట్ హౌస్ వెబ్సైట్ ప్రకారం ఈ మొత్తం సుమారుగా 10.5 ట్రిలియన్ డాలర్లు. ఈ పెట్టుబడులలో చాలా వరకు బైడెన్ పరిపాలన కాలం నాటివే. ఒక అధ్యయనం ప్రకారం, 5 ట్రిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు అసలు వాస్తవరూపం దాల్చకపోవచ్చు. ఈ సంఖ్య గణనీయంగా అతిశయోక్తితో చెప్పబడింది.
ట్రంప్ : ‘అమెరికాలో ద్రవ్యోల్బణం లేదు’
వాస్తవం: ఈ వాదన పూర్తిగా కచ్చితమైనది కాదు. 2024లో జో బైడెన్ పదవీకాలం ముగిసే నాటికి అమెరికా జీడీపీ వద్ధి 2.8 శాతంగా ఉంది. ఇది (స్పెయిన్ మినహా) ప్రధాన అభివృద్ధి చెందిన దేశాలలో అత్యంత వేగవంతమైనది. ట్రంప్ హయాంలో ఈ వృద్ధి 2.1 శాతానికి మందగించింది. అదే సమయంలో, ఫిబ్రవరి 2026లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) 2.4 శాతంగా నమోదైంది, ఇది ఫెడరల్ రిజర్వ్ నిర్దేశించిన 2 శాతం లక్ష్యం కంటే ఎక్కువ. దీనర్థం ద్రవ్యోల్బణం ఇంకా ముగియలేదు.
ట్రంప్ : ”ఒబామా ఇరాన్కు 1.7 బిలియన్ డాలర్ల నగదు ఇచ్చారు
వాస్తవం: ట్రంప్ వాదన తప్పుదోవ పట్టించేదిగా పరిగణించబడుతోంది. వాస్తవానికి, ఈ డబ్బు ఇరాన్కు చెందినది. 1970వ దశకంలో, సైనిక పరికరాల కొనుగోలు కోసం ఇరాన్ అమెరికాకు 400 మిలియన్ల డాలర్లు ఇచ్చింది. ఒప్పందం రద్దు అయిన తర్వాత ఈ డబ్బు బకాయిగా మిగిలిపోయింది. 2015లో ఒప్పందం ప్రకారం అమెరికా 400 మిలియన్ డాలర్ల అసలు మొత్తంతో పాటు 1.3 బిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించింది. దీని అర్థం అది ‘బహుమతి’ కాదు.. గడిచిపోయిన బకాయిల పరిష్కారం.
ట్రంప్ : ‘ఇరాన్ క్షిపణి శక్తి నాశనమైంది, సైన్యం, నౌకాదళం ధ్వంసమయ్యాయి
వాస్తవం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదనకు విరుద్ధంగా, ఇరాన్ ఇజ్రాయిల్పై క్షిపణి దాడులు చేసింది. ఆయన ప్రసంగం తర్వాత వెంటనే, ఇరాన్ నుంచే క్షిపణులు ప్రయోగించబడ్డాయని ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. ట్రంప్ వాదనకు విరుద్ధంగా ఇరాన్ గల్ఫ్, ఇజ్రాయిల్పై ప్రతిరోజూ దాడులు చేస్తూనే ఉంది.



