”దేశంలో మహిళల అభివద్ధి, సాధికారతకు తమ ప్రభుత్వం పదకొండేండ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఆయన ప్రస్తావించారు. వాటితో నారీమణులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారంటూ ఆయనే హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్, జన్ థన్ యోజన వంటి కార్యక్రమాలతో మన ఆడపడుచుల గౌరవం పెంచామంటూ అతివలపట్ల అపారమైన వాత్సల్యాన్నీ, అంతులేని మమకారాన్నీ సోషల్ మీడియా వేదికగా కురిపిస్తున్నారు మోడీ. దానికి వారి వాటప్స్ యూనివర్సిటీలు విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నాయి.
కాషాయ కండ్లద్దాల్లో నుంచి చూస్తే కన్నీళ్లు కూడా ఆనంద భాష్పాల్లాగానే కనిపిస్తాయి కాబోలు. నిత్యం లైంగికదాడులతో చిల్లులు పడిన దేహంతో ‘మహిళలు’ చేస్తున్న హాహాకారాలు కూడా వారి కండ్లకు కేరింతలుగానే కనబడు తున్నాయి కాబోలు. తన పదకొండేండ్ల పాలనకు ఆయనకు ఆయనే జబ్బలు చరుచుకొని తెగ పొంగిపోతున్నారు.
మన దేశంలో పాలకుల వైఖరి చూస్తుంటే మాటలకూ చేతలకూ పరస్పర వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది మొదలు జరుగుతున్న లైంగికదాడులు అన్నీ ఇన్నీ కాదు. ఉన్నావో బాలికపై లైంగికదాడి హత్య ఉదంతం మొదలుకొని కథువా ఆలయంలో ఎనిమిదేండ్ల బాలికపై నలుగురు పోలీసులు సహా ఎనిమిది మంది జరిపిన వికృతకాండ, మణిపూర్లో ఆదివాసీ మహిళలను నగంగా ఊరేగించడం వీరి పాలనలో మహిళల పరిస్థితికి మచ్చుతునకలు.
కర్నాటకలో హిజాబ్ను వ్యతిరేకిస్తూ మహిళలను, వారి మత సంప్రదా యాన్ని అవమానించిన తీరు చూశాం. చదువుకునే ఆడపిల్లలను వేధించి, హింసించిన వైనం చూశాం. దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన క్రీడాకారులు ‘మాపై లైంగికదాడులు జరుగుతున్నాయి మహా ప్రభో.. కాపాడండి’ అని వేడుకుంటే స్పందించిన పాపాన పోలేదు సరి కదా… రోజులు తరబడి ధర్నా చేస్తే అంతిమంగా చతురోపాయాలతో రెజ్లర్ల నోళ్లు మూయించిన ఘటనలు మన కండ్ల ముందే ఉన్నాయి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
”ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన్” ద్వారా తలసరి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు పొందుతున్న ఈ దేశంలో మహిళా సాధికారిత సాధించామని ప్రధాని చెబితే ఎలా నమ్మడం? ప్రభుత్వం విదిలించే సంస్కరణలతో చాలీచాలని జీతాలతో గడపక తప్పని దేశంలో ఎంపవర్మెంట్ అనేది ఒక మోసకారి మంత్రం. డ్వాక్రాలతో, చిన్న పొదుపు మొత్తాలతో, వడ్డీ లేని రుణాలతో మహిళల ఎంపవర్మెంట్ సాధ్యం అంటే అది పచ్చి మోసమే. ప్రజలకు తమ శ్రమశక్తిపై స్వతంత్రంగా, తల ఎత్తుకొని గర్వించే విధంగా సంపాదించుకునే మార్గాలు కల్పించలేని పాలన, ఉద్యోగాలు చూపలేని ఉపాధి రహిత జీడీపీ వద్ధి, పరాధీన బతుకులతో ప్రజలుంటే మోడీ నేటి ‘ఎక్స్’ పోస్ట్ దేనికి సంకేతం?
నిర్భయ, హత్రాస్, కథువా, ఆర్జికార్లో డాక్టర్పై జరిగిన లైంగికదాడుల గురించి విన్నప్పుడు అంత దారుణంగా మనిషి అనేవాడు ప్రవర్తిస్తాడా అనే అనుమానం కలగక మానదు. దాదాపు అన్ని అవయవాలను ప్రమాదకరంగా గాయపరచడం, ఎముకలు విరిచేయడం వంటి అమానుష ఘటనలన్నీ వీరి ఏలుబడిలోనే జరిగాయన్న సంగతి ప్రధాని మరిచినా.. ప్రజలు మరిచిపోలేదు.
మనదేశంలో మోడీ ఏలుబడిలో అప్రకటిత రాజ్యాంగంగా చెలామణి అవుతున్న మనుస్మతి బోధించిన పురుషాధిక్య భావజాలం, స్త్రీని బానిసగా చూసే మనస్తత్వం ఈ ఘటనలకు కారణం కాదా? ఈ లైంగికదాడులకు అసాంఘిక వ్యక్తిత్వం, మద్యం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు, నిందితులకు అండగా నిలబడే నీచ రాజకీయాలు, కామాంధులను కాపాడే నేటి అధికార వ్యవస్థ అన్నీ కారణాలే! స్త్రీని లైంగిక వస్తువుగా చూసినంత కాలం ఈ హింస తగ్గదు.
మహిళను దేవతగా పూజించాలని చెప్పే మనదేశంలో స్త్రీలపై హింస, మరణాల శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో కన్నా చాలా ఎక్కువ. కట్టుబాట్లు, సాంప్రదాయం, మగవారికి ఎదురు చెప్పకూడదనే భావజాలం చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు తప్పడం లేదు. మహిళాభివద్ధి, సమానత్వం, సాధికారత అని నాయకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనాన్ని ఇవి చాటి చెబుతున్నాయి. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పరిస్థితి మరింత దిగజారింది. బేటీ బచావో, బేటీ పఢాబో కేవలం నినాదంగానే మిగిలింది. దీనికి ప్రధాన కారణం సమానత్వాన్ని నొక్కి చెప్పే భారత రాజ్యాంగానికి బదులుగా, ”మహిళలు స్వేచ్ఛకు అర్హులు కాదు” అని ప్రకటించే మనుస్మతిని అమలుచేసేందుకు పాలకులు ప్రయత్నించడమే. ఈ వాస్తవాలను మరుగుపరుస్తూ తన పాలనకు తానే కితాబు ఇచ్చుకుంటూ ప్రధాని పోస్టులు పెట్టుకోవడం విడ్డూరం కాక మరేమిటి?
ఇదెక్కడి విడ్డూరం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES