నవతెలంగాణ – ఉప్పునుంతల
సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) ఉప్పునుంతలలో రేపటి నుంచి హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ స్వప్న మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ను 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న, 15 సంవత్సరాల లోపు బాలికలకు అందిస్తామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని ఆమె వివరించారు.
టీకాల నిర్వహణకు సంబంధించిన విధానంపై వైద్య సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఉప్పునుంతల మండలంలోని ప్రజలు తమ 14 సంవత్సరాల బాలికలకు ఈ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమానికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని వైద్యాధికారులు కోరారు.



