- Advertisement -
- – 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
- – బైక్ పై పర్యటించి చక్కద్దిదిన కలెక్టర్, ఎస్పీ
- నవతెలంగాణ – మల్హర్ రావు
- సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మూడో రోజున కాళేశ్వరానికి సందర్శకుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్స్ కావడంతో వాహనాల్లో భారీగా సందర్శకులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం ప్రధాన రహదారిలో సుమారుగా 10 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్రమబద్దీకరించేందుకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ బైకుపై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నమైయ్యారు. శనివారం వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈదురు గాలులు రావడంతో పుష్కర ఘాట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్దరించే పనిలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే నిమగ్నం అయ్యారు.సందర్శకులకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ అధికారులు తక్షణమే పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్ సరఫరా అందించారు. అర్ధరాత్రి వచ్చిన ఈదురు గాలుల కారణంగా టెంట్లు నేలకూలిపోగా వాటిని సవరించే పనులను ప్రత్యక్ష్యంగా కలెక్టర్, ఎస్పీలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయన్న సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు ఇద్దరు తమ కాన్వాయిలను పక్కన పెట్టి బైకుపై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టించారు. శని, ఆది వారాల్లో సందర్శకుల రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
- Advertisement -