రూ. కోట్లలో ఇరిగేషన్ ఈఈ అక్రమాస్తులు
ఏసీబీ దాడుల్లో వెల్లడి
ఈఈ నూనె శ్రీధర్ అరెస్ట్.. జైలుకు తరలింపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విధుల్లో ఉన్న ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ (ఈఈ) నూనె శ్రీధర్బాబుకు చెందిన కోట్లాది రూపాయల అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు బయటపెట్టారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ ఈఈగా ఉన్న శ్రీధర్బాబు అక్రమాస్తు లపై బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని శ్రీధర నివాసాలు, విల్లాలు, వ్యవసాయ భూములు, కమర్షియల్ కాంప్లెక్స్లపై ఏసీబీకి చెందిన ప్రత్యేక టీంలు దాడులను నిర్వహించాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజరు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడి శ్రీధర్ భారీ ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్టు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో షేక్పేట్లోని ఫ్లాట్, అమీర్పేట్లోని భారీ కమర్షియల్ కాంప్లెక్స్, శివార్లలోని విల్లాపై మొదట ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వరంగల్, కరీంనగర్లలోని విలువైన ప్రాంతాల్లో కూడా 19 ఓపెన్ ప్లాట్లతో పాటు 16 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు కనుగొన్నారు. అలాగే, మరికొన్ని ఫ్లాట్స్ కూడా బయట పడ్డాయి. శ్రీధర్బాబు నివాసంలో భారీ మొత్తంలో నగలు, నగదుతో పాటు మరికొన్ని బ్యాంకులలోని లాకర్లను కూడా తెరిచి అందులో నుంచి భారీ ఎత్తున నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీధర్ను అరెస్ట్ చేసి, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. అనంతరం నిందితుడిని జైలుకు తరలించారు.
్