77 ట్రక్కులను వేలాది మంది అడ్డుకొని…
గాజా : గాజాలో ఆకలి కేకలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి గోదాములపైనా దాడులు చేసి ఆహార పదార్థాలను తీసుకెళ్తున్న ఘటనలు తరచూ అక్కడ కనిపిస్తున్నాయి. తాజాగా గాజాలోకి ఆహార పదార్థాలతో వెళ్తున్న అనేక ట్రక్కులను వేలాది మంది పాలస్తీనీయన్లు అడ్డుకున్నారు. ఆ ట్రక్కులు గమ్యస్థానాలు చేరకముందే అందులోని ఆహార పదార్థాలను స్థానికులు తీసుకెళ్లినట్టు ఐరాసకు చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్పీ) వెల్లడించింది.
”గాజాలోకి శుక్రవారం నుంచి శనివారంఉదయం వరకు 77 ట్రక్కులను డబ్ల్యూఎఫ్పీ తీసుకువచ్చింది. అయితే, ఆహార పదార్థాలతో వెళ్తున్న ఆ ట్రక్కులను మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. దాదాపు 80 రోజుల పాటు సాయం నిలిచిపోవడంతో వేలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో ఆ వాహనాలను ముందుకు వెళ్లనిచ్చేందుకు వాళ్లు సిద్ధంగా లేరు” అని డబ్ల్యూఎఫ్పీ పేర్కొంది.కొన్ని రోజులుగా ఈ సాయాన్ని పంపించేందుకు ఇజ్రాయిల్ అనుమతించినప్పటికీ.. తగినంత ఆహారం ఇంకా అందుబాటులో లేదని డబ్ల్యూఎఫ్పీ అభిప్రాయపడింది. అక్కడ ఆకలి భయం ఎక్కువగా ఉందని, వారి ఆందోళనలను తగ్గించాలంటే మరింత సాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే వేగంగా అనుమతులు ఇవ్వడంతోపాటు వీటిని తరలించే కాన్వారు కూడా సురక్షితంగా వెళ్లే పరిస్థితులు ఉండాలని తెలిపింది. మరోవైపు, గాజాలోని పాలస్తీనీయన్లకు మానవతా సాయం తరలింపునకు ఇజ్రాయిల్ పరిమితంగానే అనుమతిస్తోంది. దీంతో ఇటీవల 121 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు గాజాలోకి ప్రవేశించాయి. అయితే, తీవ్ర ఆకలి సంక్షోభం ఎదుర్కొంటున్న గాజావాసులకు ఇవి అంతగా సరిపోవడం లేదు. దీంతో ఆహార పదార్థాల గోదాముపై దాడులుచేసి.. గోధుమపిండి, ఇతర ఆహార పదార్థాలున్న పెట్టెలను లూటీ చేసినట్టు తెలుస్తోంది.
గాజాలో ఆకలి సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES