మృతదేహాన్ని ముక్కలు
ముక్కలు చేసిన వైనం
భార్య శరీర భాగాలు కవర్లో పెట్టి మూసీలో పారేయడానికి యత్నం
మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో దారుణం
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రేమవివాహం చేసుకున్న దంపతుల మధ్య వచ్చిన కలహాలు.. చివరికి భర్త భార్యను హత్యచేసే స్థాయికి తీసుకెళ్లాయి. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, కవర్లో పెట్టి మూసీనదిలో పారేయాలని ప్రయత్నిస్తుండగా ఇరుగు పొరుగువారి అప్రమత్తతతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్లోని బాలాజీ హిల్స్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (25), మహేందర్ రెడ్డి.. ప్రేమించుకొని.. ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. ఇంటర్ చదివిన మహేందర్రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్వాతి కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం బోడుప్పల్లో నివాసముంటున్న దంపతుల మధ్య పెండ్లయిన రెండు నెలల నుంచే గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గర్భవతిగా ఉన్న భార్య స్వాతిపై మహేందర్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. తన ఇంట్లోనే స్వాతిని చంపి, పాశవికంగా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. శరీరంలోని కాళ్లు, చేతులు, తల వేరు చేసి మూసీ నదిలో పడేశానని నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. ఛాతీ భాగాన్ని మాత్రం ఇంట్లో కవర్లో నింపి బయటకు తీసుకెళ్లే యత్నం చేశాడు. అయితే, గదిలో నుంచి అనుమానాస్పద శబ్దాలు రావడంతో పొరుగువారు అక్కడికి చేరుకున్నారు. కవర్లో శరీర భాగాలు కనిపించడంతో వెంటనే స్థానిక మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీపీ పద్మజా రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, సీఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో శరీర భాగాల కోసం మూసీ పరివాహక ప్రాంతంలో గాలిస్తున్నారు. నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
గర్భిణిని హత్యచేసిన భర్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES