విజయ్ హజారే ట్రోఫీ 2025
రాజ్కోట్ : విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా మూడో పరాజయం చవిచూసింది. రాజ్కోట్లో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్ల్లో హైదరాబాద్ తొలి మూడు మ్యాచ్ల్లో తేలిపోయింది. సోమవారం అస్సాంతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ సింగ్ (79, 71 బంతుల్లో 14 ఫోర్లు), అభిరాత్ రెడ్డి (54, 66 బంతుల్లో 6 ఫోర్లు), నితీశ్ రెడ్డి (53, 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్థ సెంచరీలతో రాణించారు. ఛేదనలో సిబ్శంకర్ రాయ్ (112, 109 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి తోడు ఓపెనర్ సౌరవ్ (91, 112 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ దాస్ (54, 46 బంతుల్లో 7 ఫోర్లు) మెరవటంతో అస్సాం 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరో 3 బంతులు మిగిలి ఉండగానే అస్సాం 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ కెప్టెన్ సివి మిలింద్ (3/68) మూడు వికెట్లు పడగొట్టాడు. గ్రూప్-సిలో ఆంధ్రపై ఒడిశా 6 వికెట్లతో గెలుపొందింది. ఆంధ్ర 221 పరుగులకు ఆలౌట్ కాగా.. ఒడిశా 43.4 ఓవర్లలో 223/4 పరుగులు చేసింది. ఆంధ్రకు మూడు మ్యాచ్ల్లో ఇది రెండో ఓటమి.
ముంబయి, ఢిల్లీ, కర్ణాటక జోరు :
విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి, ఢిల్లీ, కర్ణాటక హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశాయి. సోమవారం బెంగళూరులోని సీఓఈలో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్రపై ఢిల్లీ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. విశ్వరాజ్ జడేజా (115), రుచిత్ అహిర్ (95) రాణించగా తొలుత సౌరాష్ట్ర 320/7 పరుగులు చేసింది. ప్రియాన్షు ఆర్య (78), తేజస్వి దహియ (53), హర్ష్ త్యాగి (49) రాణించటంతో 48.5 ఓవర్లలోనే ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది. చత్తీస్గఢ్పై ముంబయి 9 వికెట్లతో గెలుపొందింది. శార్దుల్ ఠాకూర్ (4/13), శామ్స్ ములాని (5/31) నిప్పులు చెరుగగా చత్తీస్గఢ్ తొలుత 38.1 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ముంబయి 24 ఓవర్లలోనే ఊదేసింది. రఘువంశీ (68 నాటౌట్), సిద్దేశ్ లాడ్ (48 నాటౌట్) రాణించారు. మరో మ్యాచ్లో తమిళనాడుపై కర్ణాటక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత తమిళనాడు 49.5 ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది. కర్ణాటక 47.1 ఓవర్లలో 6 వికెట్లకు 293 పరుగులు చేసి విజయం సాధించింది.
హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి
- Advertisement -
- Advertisement -



