మిరాలం చెరువులో 9 మందిని కాపాడిన హైడ్రా సిబ్బంది
ఇంజిన్ ఫెయిల్ కావడంతో చెరువు మధ్యలో ఆగిన బోట్
నవతెలంగాణ – ధూల్ పేట్
అర్ధరాత్రి హైడ్రా ఆపదమిత్ర పాత్ర పోషించింది. హైదరాబాద్ పాతబస్తీ జూపార్కు దగ్గరలోని మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మందిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందం ఆదివారం అర్ధరాత్రి కాపాడింది. వివరాల్లోకెళ్తే.. మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో భాగంగా ట్యాంక్ మీదుగా నిర్మించనున్న వంతెన కోసం సాయిల్ టెస్ట్కు కార్మికులు, ఇంజినీర్లు ఆదివారం ఉదయం బోటు సాయంతో వెళ్లారు. పని ముగించుకుని సాయంత్రం చీకటి పడ్డాక తిరిగి రావాల్సి ఉండగా బోటు ఇంజిన్ ఫెయిల్ అయింది. అప్పటికే చీకటి పడటంతో ఆందోళనకు గురయ్యారు. మెకానిక్ బృందానికి ఫోన్ చేయగా బోటు ఒడ్డుకు వస్తేనే ఇంజిన్ మరమ్మతు చేయగలమని చెప్పారు. బోటును మెల్లగా నెట్టుకొద్దామని ప్రయత్నిస్తే చెరువులో దట్టంగా వున్న గుర్రపు డెక్క ముందుకు కదలనీయలేదు. ఒకపక్క చెరువులో ఉన్న మొసళ్ల భయం, మరోపక్క ఒడ్డుకు చేరే అవకాశం లేక ప్రాణం అరచేతిలో పెట్టుకొని భయాందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే హైడ్రా డీఆర్ఎఫ్ కంట్రోల్ రూంకి ఫోన్ వచ్చింది. మిరాలం చెరువు మధ్యలో చిక్కుకున్న వారితో హైడ్రా డీఆర్ఎఫ్ బృంద సభ్యులు మాట్లాడారు. హైడ్రా ఎస్ఎఫ్ఓ జమీల్, హైడ్రా రెస్క్యూ టీమ్ ఇన్చార్జి స్వామి నేరుగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తాము బోటుతో వస్తాం.. రాత్రి ఎంత సమయం అయినా సురక్షితంగా బయటకు తీసుకొస్తామని చెబుతూ.. నిరంతరం వాళ్లతో మాట్లాడారు. చీకటిగా ఉండటం.. గుర్రపు డెక్క ఎక్కువగా ఉండటంతో చెరువులో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చడం కష్టమైంది. సెల్ఫోన్ లైట్లతో చెరువులో చిక్కుకున్నవాళ్లు ఆచూకీ చెప్పగా, టార్చ్ లైట్లతో డీఆర్ఎఫ్ బృందాలు అతి కష్టమ్మీద అక్కడకు చేరుకున్నాయి. ముందుగా నలుగురిని డీఆర్ఎఫ్ బోటులో ఒడ్డుకు చేర్చారు. రెండోసారి వెళ్లి మిగిలిన ఐదుగురుని తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమను కాపాడిన హైడ్రా బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. చాలా ఆందోళనకు గురయ్యాయమని, నిరంతరం తమతో ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెప్పడమే కాకుండా అర్ధరాత్రి వేళ తమని కాపాడారని చెప్పారు.
హైడ్రా.. అర్ధరాత్రి ఆపదలో ఆప్తమిత్రులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



