Saturday, June 14, 2025
E-PAPER
Homeజాతీయంహైడ్రాలిక్‌, ఇంధన లీకేజీలు, బ్యాటరీల సమస్యలు

హైడ్రాలిక్‌, ఇంధన లీకేజీలు, బ్యాటరీల సమస్యలు

- Advertisement -

– బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌తో ఎప్పుడూ చిక్కులే
– ఏడాదిలో ఐదు ఫిర్యాదులు
– వీటితో ఎయిర్‌ఇండియాకు అదనపు ఖర్చే

అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787 విమానం పనితీరు, సామర్ధ్యంపై మరోసారి చర్చకు వచ్చింది. ఈ విమానంలోని సాంకేతిక లోపాలు, లొసుగులపై గత కొద్ది మాసాలుగా ప్రపంచవ్యాప్తంగా ఫిర్యాదులు అందుతునే వున్నాయి. ఇంజన్లు, గేర్లు, ఫ్లాప్‌లు, కేబిన్‌లో ఒక్కసారిగా పీడనం పడిపోవడం, ఎత్తుకు చేరలేకపోవడం వంటి సమస్యలు తలెత్తిన సంఘటనలు ఈ ఏడాది కాలంలో ఐదు జరిగాయి. ఎయిర్‌ ఇండియా గత దశాబ్ద కాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూనే వుంది. గతేడాది డిసెంబరు 13న జరిగిన సంఘటన తాజాది. న్యూఢిల్లీ నుండి బర్మింగ్‌హాంకు ప్రయాణిస్తున్న ఎఐ-113 విమానం బర్మింగ్‌హామ్‌ రన్‌వేకు చేరువలో వుండగా ముందు భాగం నోస్‌ గేర్‌లో హైడ్రాలిక్‌ లీక్‌ అయినట్లు తెలిసింది. ల్యాండ్‌ అయిన తర్వాత దాన్ని పక్కకు తీసుకెళ్ళి 28గటల పాటు నిలిపివేశారు 2011లో వీటిని తొలిసారిగా ఎయిర్‌ఇండియాలో ప్రవేశపెట్టారు. రెండేళ్ళ తర్వాత 2013 మార్చిలో జపాన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఇంధన లీకేజీ సమస్య తలెత్తింది. వెంటనే కిందకు దింపేశారు. అలాగే అమెరికా విమానంలో ప్రధాన బ్యాటరీల సమస్యలు తలెత్తాయి.
కొట్టిపారేసిన బోయింగ్‌
బోయింగ్‌ ఇంజనీర్‌ సామ్‌ సలేపూర్‌ కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వీటిపై పలు విమర్శలు చేశారు. బోయింగ్‌ 777, 787 విమానాల మోడల్‌ నిర్మాణంలోనే నాణ్యత సరిగా లేదని అన్నారు. వీటివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం వుందని హెచ్చరించారు. ఆ ఆరోపణలు, విమర్శలను బోయింగ్‌ ఆనాడే కొట్టిపారేసింది.
అదనపు ఖర్చే…
భారత్‌లో బాగా తుపానులు వచ్చే సమయంలో డ్రీమ్‌లైనర్‌లో ప్రయాణాలు నివారించాలని బోయింగ్‌, ఎయిర్‌ ఇండియాకు సూచించింది. ఇంజన్లపై ఐస్‌ పేరుకుపోయే ముప్పు పెరుగుతుందని తెలిపింది. దీనివల్లే ఢిల్లీ-టోక్యో రూట్‌లో విమానాన్ని నిలిపివేశారు. ఢిల్లీ-కోల్‌కతా విమానంలో విండ్‌షీల్డ్‌ బీటలు వారిందని వెల్లడైంది. ప్రారంభించిన 14 మాసాల కాలంలోనే ఎయిర్‌ ఇండియా డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో 136 స్వల్ప లోపాలు తలెత్తాయి. లోపాలు తలెత్తిన విమానాలను తక్షణమే నిలిపివేయడం వల్ల ఎయిర్‌ఇండియాకు అదనంగా రోజుకు 60లక్షల రూపాయిలు ఖర్చు కూడా అయింది. ఆ రూట్‌ల్లో వేరే విమానాన్ని ఏర్పాటు చేయడానికి, పైలట్‌, ఇతర సిబ్బంది నిర్వహణా ఖర్చుల కింద రోజుకు మరో 1.43కోట్లు ఖర్చయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -