పదోసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం
19 మందికి క్యాబినెట్లో చోటు
హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ గురువారం పదోసారి ప్రమాణం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ , కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి నితీశ్కుమార్తో పాటు 19 మంది మంత్రులు ప్రమాణం చేశారు.
బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి, దిలీప్ జైశ్వాల్, మంగల్ పాండే, రామ్కపాల్ యాదవ్, సంతోష్ సుమన్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి విజరు కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రోవన్ కుమార్, లేసి సింగ్, సునీల్ కుమర్ల చేత గవర్నర్ అమాత్యులుగా ప్రమాణం చేయించారు. ఎల్జేపీ- రామ్విలాస్ పాసవాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందూస్తాన్ అవామ్ మోర్చా నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. జనవరిలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీయే వర్గాలు తెలిపాయి.
పదోసారి సీఎంగా అరుదైన రికార్డు
బీహార్ రాజకీయాల్లో అత్యంత కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నితీశ్ కుమార్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2000 సంవత్సరంలో కేవలం ఏడు రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, తర్వాత క్రమంగా రాజకీయ బలం పెంచుకొని, వివిధ కూటములతో కలిసి అనేక దఫాలు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పదోసారి సీఎంగా ప్రమాణం చేసి రికార్డు సష్టించారు.



