Thursday, January 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు

- Advertisement -

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయబోవడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. జాగృతి ఇంకా రాజకీయ పార్టీ కాలేదని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీసీలు రిజర్వేషన్లు అడగకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ పేరుతో గుంపుమేస్త్రీ, గుంటనక్క డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని స్పష్టం చేశారు. ముచ్చర్ల విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. ముచ్చర్ల బాటలో సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నామని తెలి పారు. తాము అధికారంలోకి వస్తే శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ స్ఫూర్తిదాతల విగ్రహాలు లేవని ఆమె గుర్తుచేశారు. తెలంగాలో ఉద్యోగ హీరోల చరిత్రను భవిష్యత్‌ తరాలకు తెలిసేలా ప్రయత్నిస్తామని చెప్పారు. అమరజ్యోతికి అవినీతి మరకలంటూ ఆరోపించిన కాంగ్రెస్‌ దానిపై విచారణ జరపలేదనీ, తెలంగాణ ఉద్యమకారుల జయంతి, వర్ధంతులు జరపటం లేదని విమర్శించారు.
కేంద్ర కులగణనతో రాష్ట్రంలో బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించిన మోసం బయటపడే అవకాశముందని కవిత తెలిపారు. గ్రామ పంచాయతీల్లో బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మోసం చేస్తున్నదనీ, అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ ప్రశ్నించడం లేదని తప్పు పట్టారు. మెజార్టీగా ఉన్న ప్రజలకు రాజ్యాధి కారం ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు ఎవరైనా తమను సంప్రదిస్తే వారికి మద్దతిస్తామని తెలిపారు. బీసీలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మోసం చేస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం త్వరలోనే రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
సికింద్రాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేయాలి
ఎప్పుడు పునర్విభజన జరిగినా సికింద్రాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్‌ చేశారు. జిల్లాను డిమాండ్‌ చేసిన వారిని పదేండ్లు బీఆర్‌ఎస్‌ అణచివేసి ఇప్పుడు కేటీఆర్‌ ప్రత్యేక జిల్లా కావాలని అడుగుతున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -