నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాప్ అయిన నిమిషాల్లోనే కూలిపోయింది. ప్రమాద సమయంలో 12 మంది సిబ్బంది సిబ్బందితోపాటు విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగిలిన 241 మంది మరణించారు. అదేవిధంగా హాస్టల్ భవనంలో ఉన్న వైద్యులు, సిబ్బంది కూడా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా మరో 14 మంది మరణించారు. దాంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది.
అయితేప్రమాదానికి ఓ స్థానికుడు తీసిని వీడియోనే ఆ ప్రమాదానికి సంబంధించి మొదటి ఆధారం. దీంతో ఆ కీలక వీడియోను తీసిన ఆర్యన్ అనే 17ఏళ్ల యువకుడిని పోలీసులు గుర్తించారు. 12వ తరగతి చదువుతున్న ఆర్యన్, రెండు రోజుల క్రితం అహ్మదాబాద్లోని లక్ష్మీనగర్ ప్రాంతంలో తన తండ్రిని కలవడానికి తన గ్రామం నుండి వచ్చాడు. ప్రమాదం జరిగిన సమయంలో, అతను తన తండ్రి అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ పైకప్పుపై ఉన్నాడు. గ్రామంలోని తన స్నేహితులకు చూపించడానికి, వినోదం కోసం విమానాల వీడియోను తీస్తున్నాడు. ‘నేను ఇంతకు ముందు ఎప్పుడూ విమానం ఇంత దగ్గరగా ఎగురుతున్నట్లు చూడలేదు. అది నా తలపై నుండి వెళ్ళినప్పుడు, నేను దానిని తాకగలనని నాకు అనిపించింది. అకస్మాత్తుగా విమానం వణుకు ప్రారంభమైంది. తరువాత పెద్ద పేలుడు సంభవించింది. అది అగ్నిగోళంగా మారింది.’ అని ఆర్యన్ తెలిపాడు. అతను వెంటనే ఈ వీడియోను మెట్రోలో సూపర్వైజర్గా ఉన్న తన తండ్రికి పంపాడు. ఇదే వీడియో ఇప్పుడు పరిశోధకులకు, దర్యాప్తు సంస్థలకు ముఖ్యమైన క్లూగా మారింది.