నవతెలంగాణ – హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో తనను అరెస్ట్ చేయించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం కారణంగా ఒకసారి కాదు వందసార్లు జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్దమే అని స్పష్టం చేశారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఫార్ములా ఈ రేసు ను హైదరాబాద్ తీసుకొచ్చి నగర ప్రతిష్టను ఇనుమడింపచేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే అందాల పోటీలతో ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు లను కూర్చోబెట్టి, తనను ఏసీబీ విచారణకు పిలిపించి రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నాడని విమర్శించారు. తమ మీద అక్రమ కేసులు బనాయించి వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం, అజ్ఞానం అవుతుందన్నారు. ఒక్క కేసు కాదు 1000 కేసులు పెట్టినా ప్రశ్నించడం మానమన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజల తరుపున నిలదీస్తూనే ఉంటామన్నారు. వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తామన్న భ్రమలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న కేటీఆర్, తెలంగాణ ఉద్యమంలోనే జైలుకు వెళ్లిన తాము అన్నిటికీ తెగించే రేవంత్ రెడ్డి అరాచకాలపై కొట్లాడుతున్నామన్నారు. దేశంలోని న్యాయస్థానాలు, చట్టాల మీద తమకు అపార గౌరవం ఉందని కేటీఆర్ తెలిపారు. నిజం నిలకడ మీదనే తెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఫార్ములా ఈ కేసులో విచారణకు రమ్మనడం ఇది మూడోసారి అన్న కేటీఆర్, ఇంకో వంద సార్లు పిలిచినా పోతానని, వంద సార్లు నిజమే చెపుతానని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారాన్ని శాసనసభ సమావేశాల్లో చర్చిద్దామంటే కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందని గుర్తుచేశారు.రేవంత్ రెడ్డి కూడా ఏసీబీ కేసు ఎదుర్కుంటున్న నేపథ్యంలో దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు రమ్మంటే ఇంతవరకు పిరికిపంద రేవంత్ నుంచి స్పందన రాలేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆ విషయాన్ని పక్కకుపెట్టి లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతున్నదని కేటీఆర్ చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్న కాంగ్రెస్, రేవంత్ కపట నైజాన్ని బీసీలు గమనిస్తున్నారని తెలిపారు.

ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు వేస్తున్న విషయాన్ని రైతులు, నెలకు 2500 ఎగ్గొట్టిన మోసాన్ని ఆడబిడ్డలు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి తప్పించుకుంటున్న తీరును యువత గమనించి నిలదీస్తున్నారు కాబట్టే డైవర్షన్ కోసం కమీషన్లు, ఎంక్వైరీలని రేవంత్ రెడ్డి హంగామా చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఒక్క మంచి పని లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ దున్నపోతు ఈనింది అనగానే దుడ్డెను కట్టేయమని బిజెపి అంటున్నదని కేటీఆర్ విమర్శించారు. ఈ రెండు పార్టీల అక్రమ సంబంధం, దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం, ప్రజల రక్షణ కోసం ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఉండేది బీఆర్ఎస్సే అని కేటీఆర్ స్పష్టం చేశారు. స్వియ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. ఒకరిద్దరిని మాత్రమే జైల్లో పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి లక్షలాది కేసీఆర్ సైనికులను టచ్ చేసి ధైర్యం లేదన్నారు కేటీఆర్.