– నిజామాబాద్ ఎంపీ అరవింద్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారనే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే ఆ పార్టీ వాళ్లు నిలబెట్టుకుంటలేరు. ఒక్క సీటు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ఎదుట పోలీసుల పహారా ఎందుకు పెట్టించారు..? పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుంది. రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి. మేయర్ కోసం, పదవుల కోసం మేం అడ్డదారులు తొక్కబోం’ అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. మున్సిపల్ ఫలితాల అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 43 శాతం మైనార్టీ ఏరియా ఉన్నప్పటికీ.. 28 సీట్లు గెలవడం ఆషామాషీ కాదన్నారు. మేయర్ కోసం సింగిల్ లార్జెస్ట్ పార్టీని ముందుగా పిలవాల్సి ఉంటదని.. కానీ అలా పిలవరని లేకుంటే తామే మేయర్ సీటు పొందేవాళ్లమని అన్నారు. రెడ్డి, వెలమ, కాపు అంటూ కాంగ్రెస్ నాయకులను ఎంఐఎం దూషించినా అధికారం కోసం ఆత్మాభిమానం కూడా చంపుకుంటుందని అన్నారు. కార్పొరేటర్ ఇంటి వద్ద నలుగురు ఎస్ఐలు, ఒక ఏసీపీకి ఏం పని? కార్పొరేటర్ను కాదు మీ సీఎంను ఎత్తుకెళ్లండి. ఆయన ఓటుకు నోటు కేసులో ముద్దాయి’ అని అన్నారు. బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా పేరును ఎట్టిపరిస్థితుల్లో ఇందూరుగా మార్చుతామని, రెండేళ్లలో ఈ ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యానించారు. ఆర్మూర్లో తక్కువ సీట్లు గెలవడంపై మాట్లాడుతూ ఇకపై నుంచి తానే నేరుగా మానిటరింగ్ చేస్తానని అన్నారు. మేయర్ కోసం కాంగ్రెస్ కార్పోరేటర్లను స్వాగతించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు.. ఎవరైనా వస్తే పార్టీ ఆలోచించి పరిశీలించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్త, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేశ్ కులాచారి తదితరులు పాల్గొన్నారు.
పదవుల కోసం అడ్డదారులు తొక్కను
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



