భారత్, పాక్ ఆసియా కప్ వివాదం
దుబాయ్ : ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ అల్టిమేట్ థ్రిల్లర్ ముగిసినా.. ఇరు జట్ల ఆటగాళ్ల ప్రవర్తన, ట్రోఫీ ప్రదానం వంటి అంశాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ ఆసియా మ్యాచుల్లో (సెప్టెంబర్ 21, 28) హరీశ్ రవూఫ్ (పాక్), సూర్యకుమార్ యాదవ్, జశ్ప్రీత్ బుమ్రాలు క్రమశిక్షణా నియమావళి ఉల్లంఘించారని అభియోగాలు మోపినా.. ఆటగాళ్లు వాటిని తిరస్కరించారు. దీంతో ఐసీసీ ఈ అంశాల్లో విచారణ చేపట్టింది. ఆటగాళ్ల వాదనల అనంతరం ఐసీసీ క్రమశిక్షణ చర్యలను తీసుకుంది. పాక్ ఆటగాడు రవూఫ్ రెండు మ్యాచుల్లోనూ ఆర్టికల్ 2.21 ఉల్లంఘించటంతో అతడిపై రెండు మ్యాచుల నిషేధం పడింది. 24 నెలల సమయంలో 4 డీమెరిట్ పాయింట్లు వస్తే నిషేధం అమల్లోకి వస్తుంది. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో రెండు మ్యాచులకు రవూఫ్ దూరమయ్యాడు. సూర్యకుమార్పై 2, బుమ్రాపై ఓ డీ మెరిట్ పాయింట్ ఇవ్వగా. మరో పాక్ ఆటగాడు ఫర్హాన్ ఓ డీ మెరిట్ పాయింట్తో పాటు అధికారిక హెచ్చరిక అందుకున్నాడు.



