– దానికి కులం ప్రాతిపదిక కాదు..ఆత్మన్యూనతా భావాన్ని వీడాలి
– ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్న వారిని నిలదీయండి
– పదేండ్లు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదో ప్రశ్నించండి : గురుకుల విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
”కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు. మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చింది. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి. దానికోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని బాబూ జగ్జీవన్రామ్ భవన్లో ఎస్సీ గురుకులాల్లో టెన్త్, ఇంటర్ చదివి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి సీఎం ముఖ్య అతిధిగా హాజరై, విద్యార్థులకు బహుమతులు అందచేశారు. అంతకుముందు అక్కడి ఆర్ట్గ్యాలెరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టుకున్నామనీ, మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని తెలిపారు. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు ఇచ్చారే తప్ప, ఆయా వర్గాల విద్యార్థులకు మంచి చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని చెప్పలేకపోయారని విమర్శించారు.
ప్రశ్నించండి…
పదేండ్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామనీ, గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశామనీ, కేవలం రాజకీయ కుట్రతోనే కోర్టుల్లో కేసులు వేసి వారికి నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి చర్యల వల్లే కులం సామాజిక సమస్యగా మారుతున్నదని వివరించారు. గత పాలకులు ఎన్నికల్లో ఓడిపోతే, ఆర్నెల్లు తిరగకుండానే వాళ్ల ఇంట్లో ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లు ఎదురైతే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్
మొదటి పాతికేండ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే జీవితంలో రాణిస్తారనీ, తప్పుదారి పడితే తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు ఎవరూ తెచ్చుకోవద్దనీ, కష్టపడి, ఆత్మవిశ్వాసంతో రాణించి తల్లిదండ్రులతోే పాటు రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. వందేండ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో వైస్ చాన్సలర్గా తొలిసారిగా దళితుడిని నియమిం చామనీ, విద్యా కమిషన్ చైర్మెన్గా ఆకునూరి మురళినీ, అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నామని తెలిపారు. వీళ్ళందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదనీ, బాగా చదువుకున్నారు కాబట్టే వారికి గుర్తింపు వచ్చిందని విశ్లేషించారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందనీ, అన్ని వర్గాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి, రాష్ట్ర, దేశ భవిష్యత్లో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదువుతోనే గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES